జొహాన్నెస్బర్గ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లేకుండా క్రికెట్ క్యాలెండర్ని ఊహించుకోవడం చాలా కష్టమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. 2008 నుంచి క్రికెట్ క్యాలెండర్లో ఐపీఎల్ ఓ భాగమైపోయిందని, ఆ టోర్నీ లేని ఏడాదిని ఊహించుకోవడం కూడా కష్టమేనని పేర్కొన్నాడు. ప్రేక్షకులు లేకుండా ఆడితే.. వన్డే, టీ20లతో పోల్చితే టెస్ట్ మ్యాచ్లలో ఆటగాళ్లపై అంతగా ప్రభావం చూపదని జాంటీ రోడ్స్ చెప్పాడు. దక్షిణాఫ్రికా తరఫున 50 ఏళ్ల జాంటీ రోడ్స్ 52 టెస్టులు, 245 వన్డే మ్యాచ్లు ఆడాడు.
జాంటీ రోడ్స్ తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఐపీఎల్ క్రికెటర్లకి ఆర్థికంగా, భవిష్యత్ పరంగా చాలా ముఖ్యమైన టోర్నీ. ఇందులో ఆడాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడతారు కాబట్టి.. ఐపీఎల్ లేని క్రికెట్ క్యాలెండర్కు అర్థం లేదని నా అభిప్రాయం. 2008 నుంచి క్రికెట్ క్యాలెండర్లో ఐపీఎల్ ఓ భాగమైపోయింది. ఆ టోర్నీ లేని ఏడాదిని ఊహించుకోవడం కూడా కష్టమే. ఈ ఏడాది చివరికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి.. ఐపీఎల్ జరుగుతుందని ఆశిస్తున్నా' అని అన్నాడు.
'టీ20 క్రికెట్లో అభిమానులు మరియు వాతావరణం ఆటగాడిపై ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నా. చాలా సందర్భాల్లో ఓ ఆటగాడు అభిమానుల మద్దతుతో ప్రేరణ పొండుతాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఖాళీ స్టేడియంలో జరుగుతుంది. భారతదేశంలో జరిగే రంజీ ట్రోఫీలో అభిమానులు ఉండరు. కానీ టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే.. అభిమానులు ఉన్నా లేకున్నా ఆటగాళ్ళు పోటీతోనే ఆడతారు. కొంతమంది ఆటగాళ్లకు అభిమానుల మద్దతు అవసరం. కానీ స్టేడియంలో అభిమానులు లేకపోవడం వల్ల టెస్ట్ క్రికెట్ అంతగా ప్రభావితమవుతుందని నేను అనుకోను. ఎందుకంటే తక్కువ ప్రేక్షకుల మధ్య ఆటగాళ్లు ఆడిన సందర్భాలు ఉంటాయి' అని జాంటీ రోడ్స్ చెప్పాడు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే వేదిక ఎక్కడ అన్నది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుందని అంచనా. కేవలం బీసీసీఐ మాత్రమే కాదు స్పాన్సర్షిప్ సంస్థలు, వందల మంది క్రికెటర్లకి కూడా రూ. కోట్లు చేజారనున్నాయి. కేవలం ఐపీఎల్ టోర్నీపైనే ఆధారపడి చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థీవ్ పటేల్, యూసుఫ్ పఠాన్, కరణ్ శర్మ లాంటి క్రికెటర్లు ఎందరో ఉన్నారు.
కేకేఆర్ బాధ్యతల్ని పూర్తిగా అప్పగించమని షారుఖ్ను అడిగా.. అది జరగలేదు: గంగూలీ