
హైదరాబాద్: ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తద్వారా ప్రత్యర్ధి జట్టుపై వరుసగా ఐదు టెస్టుల్లో టాస్ నెగ్గిన మూడో ఇంగ్లాండ్ కెప్టెన్గా నిలిచాడు.
అంతకముందు ఇంగ్లాండ్కు చెందిన మాజీ కెప్టెన్లు ఎఫ్ఎస్ జాక్సన్(1905లో), కొలిన్ కౌడ్రీ (1960లో) ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన భారత జట్టుపై వరుసగా ఐదు టెస్టుల్లో టాస్ నెగ్గారు. ఇక, ఇతర కెప్టెన్ల విషయానికి వస్తే 1948/49 భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు కెప్టెన్ జాన్ గొడ్దార్డ్ కూడా ఐదు సార్లు టాస్ నెగ్గాడు.
1982/83లో భారత జట్టు వెస్టిండిస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ జట్టు కెప్టెన్ క్లైవ్ లాయిడ్ కూడా ఐదు సార్లు నెగ్గాడు. ఇప్పుడు జో రూట్ వీరిద్దరి సరనన చేశాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మాత్రం సౌతాంప్టన్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్కు ఇదే చివరి టెస్టు. ఈ మ్యాచ్ తర్వాత అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు.
ఇక, భారత్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి అరంగేట్రం చేశాడు. విహారికి ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయర్ విహారి.
జట్టులో కరుణ్ నాయర్ రూపంలో మరో సీనియర్ బ్యాట్స్మన్ ఉన్నప్పటికీ, అతడిని కాదని విహారికి తుది జట్టులో చోటు కల్పించారు. అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు.