ముంబై : ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్కప్నకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో ఒక్కో ప్లేయర్ తమ బలహీనతలను సమీక్షించుకొని వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. 19 ఏళ్ల సంచలనం జెమీమా రోడ్రిగ్స్ సైతం తన బ్యాట్ స్పీడ్ పెంచుకొని, భారీ షాట్లు కొట్టే నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
'నా బ్యాక్ఫుట్ నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టా. తద్వారా బ్యాట్ స్పీడ్ పెంచాలనుకుంటున్నా. ప్రస్తుతం భారీ షాట్లు కొట్టలేకపోతున్నా. బ్యాట్ స్పీడ్ పెరిగితే సులువుగా సిక్సర్లు కొట్టొచ్చు'అని వివరించింది. ప్రపంచక్పలో భాగంగా ఫిబ్రవరి 21న సిడ్నీలో జరిగే తమ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియాను భారత్ డీకొననుంది. ఈ మ్యాచ్పై జెమీమా మాట్లాడుతూ 'ఆసీస్ సహజంగానే బలమైన జట్టు. వారితో మ్యాచ్ అంటే అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. పైగా ఆస్ట్రేలియా నా ఫేవరెట్ జట్టు. దానిపై బాగా ఆడడంకంటే ముందు మానసికంగా పైచేయి సాధించాలి.' అని జెమీమా చెప్పింది.
2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జెమీమా.. తన నిలకడైన ప్రదర్శనతో జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. ఆమెకు కెరీర్లో ఇది తొలి ప్రపంచకప్ కాగా.. మెగా ఈవెంట్ ఫైనల్ ఆడటం తన కళ అని తెలిపింది.
'నా చిన్నప్పుడు కిక్కిరిసిన మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నట్లు.. ఆడటమే కాకుండా అద్భుతంగా రాణిస్తున్నట్లు కళలు కనేదాన్ని. ఇది నిజం కావాలనుకుంటున్నాను. ఈ ప్రపంచకప్ నాకెంత ముఖ్యమో మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇప్పటివరకు నా జీవితంలో నేను ప్రపంచకప్ ఫైనల్ ఆడలేదు. 2017 వన్డే వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరినా.. ఆ జట్టులో నేను లేను. అందుకే మెగాటోర్నీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను'అని ఈ మహిళా బ్యాటర్ తెలిపింది. ఇక ప్రపంచకప్ ముందు భారత మహిళల జట్టు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడనుంది. జనవరి 31న ఆస్ట్రేలియా వేదికగానే ఈ సిరీస్ ప్రారంభంకానుంది.