
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా రంగం నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఆయన జనసేన అనే పార్టీని స్థాపించి అంచలంచలుగా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానం క్రికెట్ స్టేడియంలో కూడా దర్శనమిచ్చింది.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం దుబాయిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆడియన్స్ గ్యాలరీలో ఒక్కసారిగా జనసేన పార్టీ జెండా ప్రత్యక్షమైంది. పవన్ అభిమాని ఒకరు గ్యాలరీ కూర్చొని జనసేన జెండాని ప్రదర్శించాడు.
దీంతో ఈ దృశ్యాన్ని స్క్రీన్షాట్ తీసి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు కెప్టెన్ అన్షుమన్ రాత్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
అయితే, ఆరంభంలోనే భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద హాంకాంగ్ స్పిన్నర్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో హాంకాంగ్ బౌలర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్లో సిక్స్ కోసం రోహిత్ శర్మ ప్రయత్నించగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి మిడాఫ్లో గాల్లోకి లేచింది.
అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న నిజాఖత్ అలవోకగా క్యాచ్ అందుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన తర్వాత ఆడుతున్న తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ సాధించడం గమనార్హం.
నిజాఖత్ వేసిన ఇన్నింగ్స్ 19.1వ బంతికి లాంగాన్లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. మరోవైపు హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు (39) పరుగులతో అతడికి సహకారం అందిస్తున్నాడు. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది.