హైదరాబాద్: గతవారం డ్రగ్ పరీక్షల్లో విఫలమవడంతో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 21 రోజుల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో అతడిని ఇంగ్లాండ్ జట్టు ఆడే అన్ని ఫార్మాట్ల నుంచి బోర్డు తప్పించింది. దీంతో మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్కు సైతం దూరమయ్యేలా ఉన్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ నేపథ్యంలో అతడి స్థానంలో వరల్డ్కప్కు ముందు పాకిస్థాన్తో జరిగే ఒక టీ20, ఐర్లాండ్తో జరిగే ఒక వన్డేల జట్టులో యువ క్రికెటర్ జేమ్స్ విన్స్కి స్థానం కల్పించారు. కౌంటీల్లో హాంప్షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జేమ్స్ విన్స్ వన్డే కప్ గేమ్స్లో ఐదు మ్యాచులాడి 490 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ తరుపున ఆరు వన్డే మ్యాచులాడి ఒక హాఫ్ సెంచరీతో పాటు 131 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్కప్ కోసం ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ జట్టులో అలెక్స్ హేల్స్కు చోటు దక్కింది. అయితే, ఆ తర్వాత అతను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో బోర్డు విచారణ చేపట్టింది.
ఈ విచారణలో భాగంగా అతడికి పరీక్షలు నిర్వహించడంతో విఫలమయ్యాడు. దీంతో అతిడిపై 21 రోజుల పాటు నిషేధాన్ని విధించింది. దీంతో పాక్, ఐర్లాండ్ సిరీస్లకు హేల్స్ దూరం అయ్యాడు. మే30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్కప్ జట్టులో హేల్స్కు చోటు దక్కుతుందా లేదా? అన్నది అనుమానంగా మారింది.
లండన్లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ 12వ ఎడిషన్ వరల్డ్కప్తో ఇంగ్లాండ్ సమ్మర్ ఇంకాస్త వేడెక్కనుంది. ఈ వరల్డ్కప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన పద్దతిలో జరిగే ఈ వరల్డ్కప్లో ఒక్కో జట్టు టోర్నీలోని మిగతా జట్లతో తలపడనుంది.
వన్డే వరల్డ్కప్కు యునైటెడ్ కింగ్డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.