రిటైర్మెంట్ నా సొంత నిర్ణయం
'రిటైర్మెంట్ నా సొంత నిర్ణయం. ఎవరి ఒత్తిడి లేదు. నవంబర్ 1న కివీస్తో జరిగే టీ20 నా చివరి అంతర్జాతీయ మ్యాచ్. అదీ కూడా నా సొంత మైదానమైన ఢిల్లీలో సొంత అభిమానుల మధ్య వీడ్కోలు పలకడం కంటే ఇంకేం కావాలి. నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎప్పటికీ వెనక్కి తీసుకోను' అని నెహ్రా పేర్కొన్నాడు.
వీడ్కోలు తర్వాత ఐపీఎల్లో కూడా ఆడను
'అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించిన తర్వాత ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఆడను. రాబోయే రోజుల్లో పెద్ద టోర్నీ కూడా లేదు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇదే సరైన నిర్ణయమని, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా' అని నెహ్రా తెలిపాడు.

కోచ్, కెప్టెన్లతో చర్చించా
వీడ్కోలు నిర్ణయంపై ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించిన ఆశిష్ నెహ్రా బుధవారం టీమిండియా సభ్యులతో కూడా తన నిర్ణయాన్ని చెప్పాడు. అయితే వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశం లేకపోవడంతో నెహ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
భారత్ తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్లాడిన నెహ్రా
యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చే క్రమంలో తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని నెహ్రా భావించి తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరుపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











