దూకుడు నేర్పిందే దాదా:
మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీకి ధన్యవాదాలు తెలిపాడు. 'భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది గంగూలీనే, దాన్నే మేము కొనసాగిస్తున్నాం. మ్యాచ్లను ఎలా జయించాలో గంగూలీనే పరిచయం చేశాడు. గత మూడు-నాలుగేళ్ల నుంచి తాము జట్టుగా ఎంతో కృషి చేస్తూ ఉండటమే తాజా వరుస విజయాలకు కారణం' అని కోహ్లీ తెలిపాడు.
పేసర్లు రాణించడం సంతోషం
'టెస్టు క్రికెట్ అనేది మానసిక యుద్ధం. దాన్ని ఎలా జయించాలో దాదా నుంచి నేర్చుకున్నాం. ఆత్మ విశ్వాసం అనేది కీలకం. ఇక కఠోర సాధన కూడా కావాలి. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం. రెండో టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. బూమ్రా లేని లోటును తెలియకుండా ఇషాంత్, షమీ, ఉమేష్లు బంగ్లా బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. సాధారణంగా స్వదేశంలో స్పిన్నర్లు చెలరేగి ఆడతారు. అలాంటిది పేసర్లు రాణించడం సంతోషంగా ఉంది' అని కోహ్లీ అన్నాడు.
అభిమానుల మద్దతు అద్భుతం
'సరైన సమయంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా మ్యాచ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. అభిమానుల నుంచి కూడా మాకు పూర్తి మద్దతు లభించింది. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ మంది మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారు. ఇక మూడో రోజు ఆటకు కూడా ఎక్కడా అభిమానులు తగ్గలేదు. మ్యాచ్ రెండో రోజుకే దాదాపు పూర్తి కావడంతో మూడో రోజు ఇంత మంది ప్రేక్షకులు వస్తారని ఊహించ లేదు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
క్లీన్స్వీప్
తాజా విజయంతో సిరీస్ను భారత్ 2-0తో క్లీన్స్వీప్ చేసింది. అంతకు ముందు జరిగిన టీ 20 సిరీస్ను రోహిత్ శర్మ సారథ్యంలో 2-1తో గెలిచింది. భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో కోహ్లీ మాంచి జోష్లో ఉన్నాడు. ఈ గెలుపుతో కోహ్లీసేన టెస్టుల్లో 12వ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.