ఎడ్డ్బాస్టన్: ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో తొలుత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ టాపార్డర్ వెన్ను విరవగా.. ఆపై పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగిపోయాడు. వైవిధ్యమైన బంతులు సంధిస్తూ వారి సొంతగడ్డపైనే ఇంగ్లాండ్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు ఇషాంత్. ఇన్నింగ్స్ 30వ ఓవర్ వరకు 85/4గా ఉన్న ఇంగ్లాండ్ పరిస్థితి ఆ ఓవర్ ముగిసేసరికి 87/7 గా మారిపోయింది.
30వ ఓవర్ రెండో బంతికి నిలకడగా ఆడుతున్న కీపర్ జానీ బెయిర్స్టో (28; 40 బంతుల్లో 5 పోర్లు)ను ఔట్ చేశాడు. బెయిర్ స్టో ఆడిన బంతిని స్లిప్లో ఉన్న ధావన్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ఆ ఓవర్లో 4వ బంతికి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (6) కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓవర్ చివరి బంతికి బట్లర్(1)ను ఔట్ చేసి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఇషాంత్. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ దినేశ్ కార్తీక్ క్యాచ్ పట్టడంతో 7వ వికెట్గా పెవిలియన్ బాటపట్టాడు బట్లర్.
ఓవర్నైట్ స్కోరు 9/1తో ఈరోజు ఆటని కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టును ఆరంభంలోనే భారత బౌలర్లు వణికించారు. ఇషాంత్ శర్మ (5/51), అశ్విన్ (3/59), ఉమేశ్ యాదవ్ (2/20) ధాటికి ఇంగ్లాండ్ 180 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో కుర్రాన్ (6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 13 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని.. ఇంగ్లాండ్ జట్టు 194 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు నిలిపింది.
తొలి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. కానీ సాధించాలంటే కష్టపడాల్సిందే. మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లి (43 బ్యాటింగ్; 76 బంతుల్లో 3 ఫోర్లు) భారత్ ఆశలను మోస్తున్నాడు. 194 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుక్రవారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కోహ్లికి దినేశ్ కార్తీక్ (18 బ్యాటింగ్) అండగా ఉన్నాడు.