దూకుడు..సానుకూల దృక్పథం..
భారత క్రికెట్ జట్టు శక్తి సామర్థ్యాలు అపారం. దూకుడు దాని నైజం. మెరుపుదాడి వెన్నతో పెట్టిన విద్య. ప్రతికూల పరిస్థితుల నుంచి నెట్టుకుని రావడం కోహ్లీ సేన చతురత. మానసిక దృఢత్వం భారత జట్టు సొంతం. అన్నింటికీ మించి సానుకూల దృక్పథంతో ఆడటం అలవాటైన పని. వేదిక ఏదైనా, దేశం ఎక్కడైనా, పిచ్ ఎలాంటిదైనా ఆగే ప్రసక్తే లేదు. ప్రత్యర్థికి తలొంచే ప్రశ్నే తలెత్తదు. ప్రత్యక్షంగా చూసే వేలాదిమంది అభిమానులు, టీవీలకు అతుక్కుని పోయే కోట్లాది మంది అభిమానుల ఆశల గురించే ఆలోచిస్తూ ప్రత్యర్థిపై ఎదురు దాడి చేస్తుంది టీమిండియా. ప్రత్యేకించి- తన ఎదురుగా ప్రత్యర్థిగా ముందరున్నది పాకిస్తాన్ అయినప్పుడు.. ఇక ఊహించాల్సిన పనే ఉండదు.
కోహ్లీ మనస్తత్వమేంటీ?
టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎంత దూకుడు వైఖరిని ప్రదర్శిస్తాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాను ఆడుతున్నది ఆప్ఘనిస్తాన్ వంటి పసికూన అయినా, ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టయినా టీమిండియా నైజం మారదు.. కోహ్లీ మనస్తత్వంలో తేడా ఉండదు. మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోయే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు పైనా అదే వైఖరిని ప్రదర్శిస్తాడు కోహ్లీ. అదే అతని బలం. నిజానికి పాకిస్తాన్పై విరాట్ కోహ్లీకి ఓ అరుదైన రికార్డు ఉంది. ఇదివరకు ఎవ్వరికీ సాధ్యపడనిది, ఎవ్వరూ అందుకోలేనిది కూడా. ఓ ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టుపై సెంచరీ చేసిన ఘనత అది. ప్రపంచకప్లో పాకిస్తాన్పై సెంచరీ చేసిన ఘనతను అందుకున్న తొలి బ్యాట్స్మెన్ కోహ్లీ. 2015 ప్రపంచకప్ పోటీల్లో దీన్ని అందుకున్నాడతను. నాలుగేళ్లు తిరిగే సరికి ఏకంగా కేప్టెన్గా బరిలో దిగుతున్నాడు. మరిన్ని అద్భుతాలు చేస్తాడని ఆశిస్తున్నారు సగటు అభిమానులు.
ఓ సెంచరీ చేసి..గాయాల పాలై!
ఆస్ట్రేలియాపై మ్యాచ్లో సెంచరీ చేసి, తిరుగులేని ఫామ్ను అందిపుచ్చుకున్న డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అదే మ్యాచ్తో దూరం అయ్యాడు. పాట్ కమ్మిన్స్ వేసిన బంతి అతని వేలిని బలంగా తాకడంతో ఫ్రాక్చరైంది. దీనితో కీలకమైన పాకిస్తాన్తో మ్యాచ్ను మిస్ అయ్యాడు. అతని స్థానంలో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్ను ఆరంభించబోతున్నాడు కన్నడిగుడు కేఎల్ రాహుల్. పలు మ్యాచ్లల్లో ఓపెనర్గా ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. ప్రపంచకప్ కావడం, ఎదురుగా ఉన్నది బౌలింగ్ వనరులు పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ కావడం వల్ల అతని మీద ఒత్తిడి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. మిడిలార్డర్లో మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. కేదార్ జాదవ్ బ్యాట్తోనూ రాణిస్తే భారత్ భారీ స్కోరును సాధించగలుగుతుంది. శ్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే బూమ్రా సహా కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఎలా బోల్తా కొట్టిస్తారనేది ఆసక్తికర అంశం. ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్ పేస్కు అనుకూలంగా ఉన్నందున షమీని ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అనిశ్చితి.. అనూహ్య విజయాలు!
సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియదు. ఒక్కసారిగా చెలరేగిపోయి ఆడనూ వచ్చు, లేదా చతికిలపడనూ వచ్చు. అలాంటి ఆటతీరుకు పెట్టింది పేరు పాకిస్తాన్ జట్టు. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచ్ల్లో పాక్ జట్టు గెలిచింది ఒకే ఒక్కటి. అది కూడా ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుపై. ఆ జట్టు ప్రధాన బలం- బౌలింగ్. ఇప్పటిదాకా లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న నిప్పులు చెరిగే బంతులతో అదరగొడుతున్నాడు. అతనికి స్పిన్నర్లు సహకరిస్తారు. బ్యాటింగ్ విషయంలో ఇమామ్, ఫఖర్, బాబర్, హఫీజ్, సర్ఫరాజ్, మాలిక్ రాణించగలరనే ఆశిస్తోందా జట్టు.