ఓడిన తీరే..
ఇక్కడ టీమిండియా పరాజయాల కంటే ఓడిన తీరే అభిమానులను ఆవేదనకు గురిచేస్తుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో కనీస పోరాటపటిమ కనబర్చలేక చిత్తుగా ఓడింది. పాకిస్థాన్తో చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ.. గత ఫలితాల అనుభవం దృష్ట్యా తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్లో విజయాన్నందుకుంటుందని, నేలకు కొట్టి బంతిలా దూసుకొస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా చేతులెత్తేసింది. పక్కా ప్లాన్తో పర్ఫెక్ట్ బౌలింగ్తో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్తో, ఖతర్నాక్ బ్యాటింగ్తో కోహ్లీసేనను ఓడించిన న్యూజిలాండ్ సెమీస్ దిశగా ముందంజ వేసింది. దాంతో కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. అయితే మెగాటోర్నీలో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణాలు.. అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్కు ప్రాధాన్యమివ్వడం, టీమ్ బయోబబుల్ లైఫ్, టీమ్ సెలెక్షన్ అనే విషయాలు స్పష్టంగా చెప్పవచ్చు.
ఐసీసీని శాస్తిస్తూ..
వాస్తవానికి ఐపీఎల్ 2021 సెకండాఫ్ను యూఏఈ వేదికగా సెప్టెంబర్లో నిర్వహిస్తామంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బోర్డులు వ్యతిరేకించాయి. ప్రపంచకప్లో సన్నాహకంగా తమ ఆటగాళ్లను పంపిచమని స్పష్టం చేశాయి. కానీ ఐసీసీని శాసిస్తున్న బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను అస్త్రంగా వాడి అన్ని దేశాల బోర్డులను తమ వైపు తిప్పుకుంది. సరిగ్గా ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యేలా షెడ్యూల్ చేసింది. దాంతో మెగాటోర్నీకి ముందు ఐపీఎల్ మంచి ప్రాక్టీస్ అని భావించేలా పావులు కదిపింది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్లో పాల్గొన్నారు. కానీ కొందరు ఇంగ్లండ్ ప్లేయర్లు మాత్రం టీ20 ప్రపంచకప్కే ప్రాధాన్యం ఇస్తూ ధనాధన్ లీగ్ను బాయ్కట్ చేశారు. తగిన విశ్రాంతి తీసుకొని ఇప్పుడు మెగాటోర్నీలో దుమ్మురేపుతున్నారు.
టెస్ట్ సిరీస్ వెంటనే ఐపీఎల్..
ఇంగ్లండ్తో అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగియకుండానే.. భారత ఆటగాళ్లు యుఏఈలో వాలిపోయారు. నెలరోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్లను ఆడారు. ఐపీఎల్ టోర్నీ ముగియగానే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను ఆడాల్సి వచ్చింది. కిందటి నెల 15వ తేదీన ఐపీఎల్ ఫైనల్ ముగియగా.. అదే నెల 24వ తేదీన ఈ వరల్డ్కప్ మొట్టమొదటి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీ కొట్టాల్సి వచ్చింది. పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనేది తెలుసు. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఒత్తిళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతో భారత్ ఆటగాళ్లు ఒత్తిడికి చిత్తయ్యారు.
టూ మచ్ క్రికెట్..
వరుసగా బయోబబుల్లో ఉండటం కూడా భారత ఆటగాళ్లను మానసికంగా కృంగ దీసింది. ఇంగ్లండ్ పర్యటనలో కరోనా కలకలం రేపడంతో మరింత జాగ్రత్తగా ఉండేలా చేసింది. ఇంగ్లండ్ పర్యటన నుంచి తాజా టీ20 ప్రపంచకప్ వరకు మొత్తం బయో బబుల్ జీవితం గడపడం ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను బట్టి.. ప్లేయర్ల మానసికంగా ఎంత ఒత్తిడిని అధిగమిస్తున్నారో తెలుసుకోవచ్చు. తమ శరీరాలు అలిసిపోయాయని, బ్రేక్ కావాలంటూ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు క్వారంటైన్ కూడా కొంత మానసిక ఒత్తిళ్లకు గురి చేసింది. బయో బబుల్ వ్యవస్థ దీనికి తోడయింది. ఈ పరిస్థితుల్లో మిగిలిన మ్యాచ్లల్లో భారత జట్టు సానుకూల ఫలితాలను సాధిస్తుందనేది కూడా ప్రశ్నార్థకమే.