ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాసిన లేఖతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరగుతుందనే భరోసా వచ్చిందని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర క్రికెట్ సంఘాలకి దాదా ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. దాదా రాసిన లేఖను చదివానని కూడా ఇర్ఫాన్ తెలిపాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్ 2020 ప్రారంభంకావాల్సి ఉంది.
స్టార్స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020 నిర్వహణ కోసం బీసీసీఐ అన్నివిధాలుగా ప్రయత్నిస్తుందని దాదా లేఖతో అర్థమైంది. ఇది భారత క్రికెటర్లకే కాదు, అంతర్జాతీయ క్రికెటర్లకూ శుభవార్త. ప్రతిఒక్కరూ టోర్నీ జరగాలని కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ జరుగుతుందని ఎంతో మంది భావిస్తున్నారు. కానీ అది అసాధ్యమనిపిస్తుంది. అక్కడ నిబంధనలు కాస్త కఠినంగా అమలు చేస్తారు. క్వారంటైన్లో ఉంటూ కొన్ని మ్యాచ్లనే ఆడటం చాలా కష్టంగా ఉంటుంది' అని అన్నాడు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి వాయిదా పడింది. అప్పటికి కూడా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడే సూచనలు కనిపించడంతో ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే టీ20 ప్రపంచకప్ వాయిదాపై ఐసీసీ ఏటూ తేల్చకపోవడంతో ఐపీఎల్పై సందిగ్ధత నెలకొంది.
మరోవైపు టీ20 ప్రపంచకప్ నిర్వహించడం సాధ్యం కాదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ 13వ సీజన్ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఐపీఎల్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ. 4వేల కోట్లు నష్టపోనుంది. క్రికెటర్లకి కూడా రూ. కోట్లలో ఆదాయం పోతుంది. బీసీసీఐ నష్టాల్లోకి వెళితే.. ఆ ప్రభావం భారత క్రికెట్ మనుగడపై కూడా పడనుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చేసినా.. ఐసీసీ ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియట్లేదు: బీసీసీఐ