హైదరాబాద్: 144 ఏళ్ల అంటే... సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు హోదా దక్కించుకుని.. టెస్టు క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన ఐర్లాండ్ జట్టును వరుణుడు అడ్డుకున్నాడు. డబ్లిన్లోని మాలహైడ్ కేస్టల్లో పాకిస్తాన్తో జరుగుతున్న చరిత్రాత్మక టెస్టు తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది.
పాకిస్థాన్తో ఐర్లాండ్ పోరు కోసం సర్వం సిద్ధం కాగా.. శుక్రవారం వరుణుడు టాస్ కూడా వేయనివ్వలేదు. పలుమార్లు మైదాన్ని పరిశీలించిన అనంతరం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు లంచ్ విరామానికి వెళ్లారు.
మరి శనివారం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. పెద్ద జట్లపై సంచలన విజయాలు సాధించడంతో పాటు, అంచనాలకు మించి రాణించడంతో అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్లకు గతేడాది ఐసీసీ టెస్టు హోదా కల్పిస్తూ, లండన్లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటు ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్లకు పూర్తి సభ్యత్వాన్ని కూడా ఐసీసీ ఇచ్చింది. ఈ రెండు జట్ల చేరికతో టెస్టు మ్యాచ్లు ఆడే దేశాల సంఖ్య 12కు చేరింది. పాక్తో ఐర్లాండ్ అరంగేట్రం చేస్తుండగా... టెస్టు హోదా దక్కించుకున్న ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టును టీమిండియాతో ఆడనుంది.
జూన్లో జరగనున్న ఈ టెస్టుకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఆప్ఘన్తో జరిగే చారిత్రాత్మక టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అతడి స్థానంలో కరుణ్ నాయర్కు సెలక్టర్లు చోటు కల్పించారు.