
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో ఆరంభం నుంచి దూకుడు మీద ఆడిన పంజాబ్ ద్వితియార్థంలో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తోన్నా.. బౌలర్లతో ఎలాగోలా నెట్టుకొచ్చేసింది పంజాబ్. ఈ క్రమంలో ప్లేఆఫ్ రేసులోకి దూసుకెళ్లే మందు జట్టు ఇదే అనుకుంటోన్న తరుణంలో వరుస వైఫల్యాలు జట్టును చుట్టుముట్టాయి. ఈ విషయమై జట్టు మెంటార్ సెహ్వాగ్పై కింగ్స్ పంజాబ్ సహ యజామానురాలైన ప్రీతి జింతా కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అవి అబద్దాలే అని కొట్టి పడేసినా వైఫల్యాల మాట నిజమే.
ఈ వివాదం అనంతరం రెండ్రోజుల తర్వాత తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీరేందర్ సెహ్వాగ్ మరో ట్వీట్ చేసి చర్చనీయాంశమైయ్యాడు. ఆ ట్వీట్లో 'హమ్ చాహే తో అప్నే ఆత్మవిశ్వాస్ ఔర్ మెహనత్ కే బల్ పర్ అప్నా భాగ్య్ ఖుద్ లిఖ్ సక్తే హై, ఔర్ అగర్ హమ్కో అప్నా భాగ్య్ లిఖ్నా నహీ ఆతా తో పరిస్థితియా హమారా భాగ్య్ లిఖ్ దేగీ!!అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.
'మనం సంకల్పించుకుంటే ఆత్మవిశ్వాసాన్ని, గొప్పదనాన్ని సంపాదించుకోగలం. కానీ, మనం అంతటి ఘనతను సాధించలేకపోతే పరిస్థితులే మన తల రాతలు మారుస్తాయ్' అనే భావం వచ్చేట్టుగా సెహ్వాగ్ చేసిన ట్వీట్కు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకసారి చూసుకో జట్టులోకి డేవిడ్ మిల్లర్ని తీసుకుంటే నీ రాత మారుతుందేమో అంటూ ట్వీట్ చేశాడు. మిగిలిన వారు సెహ్వాగ్కు మద్దతిస్తూ యువరాజ్ను తుది జట్టులోకి తీసుకోండి, యువీ లేని ప్రతి మ్యాచ్లో మీకు ఓటమి తప్పదంటూ ట్వీట్ చేస్తున్నారు.
పంజాబ్ జట్టు వరుసగా మూడు మ్యాచ్లలోనూ ఓడిపోతూనే ఉంది. లీగ్ పట్టికలో 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.