
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లే కాదు. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలకు సైతం ఆదాయాన్ని పెంచే యోచనలో పడింది బీసీసీఐ. ప్రదర్శన ఆధారంగా క్రికెటర్ల వేతనాలు పెంచిన బీసీసీఐ, ఆదాయం ఏటా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలకు పంచే ఆదాయం కూడా పెంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
ఇక నుంచి బోర్డు నుంచి ఏటా లీగ్లోని ఎనిమిది ఫ్రాంఛైజీలు తలో రూ.250 కోట్లు అందుకోనున్నట్లు తెలిసింది. ఐపీఎల్ ఆదాయం నుంచి ఫ్రాంఛైజీల వాటా కింద ఇప్పటిదాకా ఏటా తలో రూ.60 కోట్లు మాత్రమే అందుతున్నాయి. ఆ మొత్తాన్ని నాలుగు రెట్లకు పైగా పెంచాలని బోర్డు నిర్ణయించిందట.
మీడియా నుంచి వచ్చే ఆదాయం కూడా:
వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కుల్ని స్టార్ స్పోర్ట్స్కు ఏకంగా రూ.16,347 కోట్లకు కట్టబెట్టింది బీసీసీఐ. ఈ లెక్కన బోర్డుకు ప్రసార హక్కుల ద్వారానే ఏటా రూ.3200 కోట్లు అందుతాయి. గత సీజన్ వరకు సోనీ ఛానెల్ రూ.800 కోట్లు మాత్రమే చెల్లించేది. ప్రసార హక్కుల ఆదాయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీలకు చెల్లించే మొత్తం కూడా అదే స్థాయిలో పెంచనున్నారు.
కొసమెరుపు:
కేవలం ఐపీఎల్ ఆదాయాన్ని బట్టి బీసీసీఐ చెల్లిస్తే సరిపోదు. దానికి తగ్గట్లే.. ఫ్రాంఛైజీలు సైతం తమ ఆదాయంలో 20 శాతం వాటాను ఫీజు కింద బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. 20 శాతం ఫీజు చెల్లించినా దానికి తగ్గట్లే లాభాలుండటంతో.. ఫ్రాంచైజీలు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశాయి.