హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ రూ.47,500 కోట్లకు చేరింది. అమెరికా డాలర్లలో ఐపీఎల్ బ్రాండ్ విలువ 6.8 బిలియన్ డాలర్లు. గత సీజన్-11తో పోలిస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 13.5 శాతం పెరిగిందని 'డఫ్ అండ్ ఫెల్ప్స్' ఓ నివేదికలో ప్రకటించింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరగడంలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల పాత్ర ఉందని కూడా సదరు సంస్థ పేర్కొంది.
ధావన్ వీడియో.. టీమిండియాలో 'లవింగ్ అండ్ కేరింగ్ ఫాదర్స్' ఎవరంటే?
2008లో ప్రారంభమయిన ఈ లీగ్ ప్రతి సంవత్సరం తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతోంది. ఈ లీగ్లో స్టార్ క్రికెటర్లు పాల్గొనడం ఓ సానుకూలత. భారత దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా లీగ్కు అభిమానులు ఉండడం కూడా బ్రాండ్ విలువ పెరుగుతోంది. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ రూ.6,138.1 కోట్లకు కొనుగోలు చేసిందంటేనే ఈ లీగ్కు ఎంత క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
నాలుగు సార్లు టైటిల్ సాదించిన ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ 8.5 శాతం పెరిగి 809 కోట్లకు చేరింది. లీగ్లో ఇదే అత్యధిక బ్రాండ్ విలువ. చెన్నై సూపర్ కింగ్స్ విలువ రూ.732 కోట్లుగా ఉంది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఈ జట్టు ఏకంగా 13.1 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల బ్రాండ్ విలువ చెరో 8 శాతం తగ్గింది. ఈ రెండు ఫ్రాంచైజీలు గత సీజన్ను వరుసగా 5వ, 8వ స్థానంలో నిలివడంతో.. కోల్కతా విలువ 8.3 క్షీణించి రూ.629 కోట్లకు పడిపోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 శాతం పడిపోయి రూ.595 కోట్లతో సరిపెట్టుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8.9 శాతం బ్రాండ్ విలువ పెరిగి ఈ ఏడాది రూ .374 కోట్లకు చేరింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 4.6 శాతం వృద్ధితో తన బ్రాండ్ విలువను రూ.483 కోట్లుకు పెంచుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4.3 శాతం వృద్ధి సాధించి తన విలువను రూ.358 కోట్లకు పెంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం 4.5 శాతం క్షీణించి రూ.271 కోట్లకు తన బ్రాండ్ విలువను దిగదార్చుకుంది.