ఐపీఎల్ అనేది కాసుల వర్షం కురిపించే ఆట
నిజానికి ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ అయినప్పటికీ... లీగ్లోకి కార్పోరేట్ కంపెనీలు ఎంటర్ కావడంతో బిజెనెస్ పరంగా కాసుల వర్షం కురిపించే ఆటగా మారింది. పలు వ్యాపార సంస్థలు తమ బ్రాండ్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐపీఎల్ అవకాశం కల్పిస్తుంది. టోర్నీలో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ధరించే జెర్సీల మీద పదిగా పైగా బ్రాండ్ పేర్లు కనిపిస్తాయి. కంపెనీలకు మంచి ప్రమోషన్ తో పాటు ఫ్రాంచైజీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.
పెద్ద మొత్తంలో డబ్బులు కుమ్మరిస్తోన్న కార్పోరేట్ కంపెనీలు
క్రికెట్ అంటే భారత్లో ఓ మతం లాంటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రికెట్ అభిమానులు ఉన్న దేశం ఏదైనా ఉంటే అది భారత్ మాత్రమే. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆటకున్న పాపులారిటీ, ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ను కార్పొరేట్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. గతంలో కంపెనీలు ఆటగాళ్ల టీషర్టుపై లోగోలకు ఎలాంటి డబ్బులు చెల్లించేవారు కాదు. ఇప్పుడు మాత్రం లోగోలతో పాటు ఆటగాళ్ల జెర్సీలకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.
ఐపీఎల్లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్
ఐపీఎల్లో రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఉంటుంది. బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారాలు చేసే ఛానల్స్, ఆన్లైన్లో లైవ్ మ్యాచ్ల ప్రసారం చేసే సంస్థల నుండి పెద్దమొత్తంలో వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని అన్ని జట్ల ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంచుతుంది. ఫ్రాంచైజీలకు ఉన్న ర్యాంకింగ్ ఆధారంగా బీసీసీఐ పంచడం విశేషం. ఐపీఎల్ సంపాదిస్తున్న మొత్తంలో 60 నుంచి 70 శాతం వంతు మీడియా రైట్స్ ద్వారానే రావడం విశేషం. రానున్న ఐదేళ్లు(2018-2022) కోసం ఐపీఎల్ మీడియా, డిజిటల్ హక్కులను స్టార్ ఇండియా పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకుంది. టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ మీడియా(మొబైల్, ఇంటర్నెట్) రైట్స్ను స్టార్ ఇండియా సంస్థ రికార్డు స్థాయిలో రూ. 16, 347 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.