|
ఒక్క సిక్స్ కొట్టని బట్లర్..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్లో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయిదు ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్స్ కూడా అతని బ్యాట్ నుంచి రాలేదు. భారీ స్కోర్ చేస్తాడనుకున్న బట్లర్ ఫైనల్స్లో జావగారాడు. మిగిలిన బ్యాటర్లందరూ సో..సో.
|
అలవోకగా విక్టరీ..
అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. 18.1 ఓవర్లోనే టార్గెట్ను ఛేదించింది. కేప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ మ్యాచ్ను గెలిపించింది. తొలుత బౌలింగ్.. ఆ తరువాత బ్యాటింగ్లో సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. బ్యాటింగ్- 30 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. శుభ్మన్ గిల్-45, డేవిడ్ మిల్లర్-32 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
|
స్టేడియంలో అమిత్ షా..
గుజరాత్కే చెందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ, అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా సహా పలువురు ప్రముఖులు మ్యాచ్ను తిలకించారు. 1,25,000 మంది ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ సాగింది. హోమ్ టీమ్ కావడం వల్ల గుజరాత్ టైటాన్స్కే సపోర్ట్ చేశారు అభిమానులు. పొరుగునే ఉన్న రాజస్థాన్ నుంచి పెద్ద ఎత్తున అభిమానులు అహ్మదాబాద్కు తరలివచ్చారు.
|
ఫిక్సింగ్ ఆరోపణలు..
రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్లో లో-స్కోర్ చేయడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు అభిమానులు. ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనే ఆరోపణలు చేస్తోన్నారు. ఎప్పుడూ ఉండేదే అయినప్పటికీ.. ఈ సారి ఘాటెక్కించారు. మీమ్స్తో మోతెక్కించారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే #Fixing అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చిందింది. అభిమానుల అసహనం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ ఓనర్ సీవీసీ కేపిటల్స్పైనా ఆరోపణలు చేశారు.