సైమన్ కటిచ్ గుడ్బై
సన్రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ నేడు తన పదవి నుంచి తప్పుకున్నాడు. తప్పుకునే క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్పై ఆయన పలు ఆరోపణలు చేశాడు. ఈ సారి మెగా వేలంలో కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని ఆయన మండిపడ్డాడు. ముందుగా అనుకున్న వ్యూహాలను వేలంలో అమలు చేయలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మెగా వేలంలో ఫేలవమైన జట్టును కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డాడు. ఇక తాను జట్టు అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశాడు. మొత్తంగా పరిశీలిస్తే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు వంటి ప్రక్రియల విషయంలో సైమన్ కటిచ్, సన్రైజర్స్ మేనేజ్మెంట్కు మధ్య విబేధాలు వచ్చాయని అర్థం అవుతుంది.
లాస్ట్ ప్లేసు తప్పదా?
సన్రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ వివాదస్పద రీతిలో తన పదవి నుంచి తప్పుకోవడం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్కు ఈ సారి కూడా లాస్ట్ ప్లేసు తప్పదేమోనని వారు కంగారు పడుతున్నారు. గత ఏడాది లీగ్లో 3 విజయాలు మాత్రమే సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది డేవిడ్ వార్నర్తో నెలకొన్న విబేధాల కారణంగా అతన్ని జట్టు నుంచి తొలగించిన తర్వాత రైజర్స్ ఆట తీరు మరింతగా దిగజారింది. ఈ సారి కూడా అచ్చం అలాగే సైమన్ కటిచ్ తప్పుకోవడంతో ఈ సారి సైతం పాయింట్ల పట్టికలో చిట్ట చివరిదైన పదో ప్లేసు తప్పదేమోనని అభిమానులు కంగారు పడుతున్నారు. దీనికి తోడు జట్టు కూడా టేబుల్ మీద బలహీనంగా కనిపిస్తుంది.
వార్నర్ విషయంలో ఏమైంది
గతేడాది డేవిడ్ వార్నర్ను వివాదాస్పద రీతిలో సన్రైజర్స్ మెనేజ్మెంట్ జట్టు నుంచి తొలగించింది. గత సీజన్లో ఓ మ్యాచ్లో ఓటమి విషయం సందర్భంగా సన్రైజర్స్ మెనేజ్మెంట్తో వార్నర్ విబేధించాడు. తుది జట్టులో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, తాను వద్దని చెబుతున్న మంచి ఆటగాళ్లను బెంచ్లో కూర్చొబెట్టి, సాధారణ ఆటగాళ్లను తుది జట్టులో చేర్చారని వార్నర్ వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్లో ఫాంలో ఉన్న మనీష్ పాండేను తప్పించి ఇతర ఆటగాళ్లను మేనేజ్మెంట్ తుది జట్టులో చేర్చింది. ఈ విషయాన్ని వార్నర్ ప్రధానంగా ఎత్తి చూపుతూ మనీష్ పాండే ఉంటే తాము గెలిచేవారిమని వ్యాఖ్యానించాడు. దీంతో అక్కడి నుంచి వార్నర్కు మేనేజ్మెంట్కు మధ్య విబేధాలు వచ్చాయి. అదే సమయంలో వార్నర్ ఫాం కూడా కోల్పోవడంతో అతన్ని కెప్టెన్సీతోపాటు తుది జట్టు నుంచి కూడా తొలగించారు.
సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్క్వాడ్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, ఫజల్హాక్ ఫరూకీ, టీ. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్.