ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఉద్దేశించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఖండించాడు. అలాగే రమీజ్ రాజాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఒక్క పీసీబీ మాత్రమే కాదని ప్రపంచంలోని ఇతర ఏ క్రికెట్ లీగ్ కూడా ఐపీఎల్కు పోటీ ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు. వీక్షకుల సంఖ్య అధికంగా ఉండడం ఐపీఎల్కు ప్లస్ పాయింటని చెప్పుకోచ్చాడు. ఇక నగదు, మార్కెట్ విలువ ఐపీఎల్ను అసమానంగా మార్చిందని తెలిపాడు. ఒక వేళ డ్రాఫ్ట్ పద్దతి కాదని, వేలానికి వెళ్లిన రమీజ్ రాజా చెప్పింది జరగదని, పీఎస్ఎల్లో 16 కోట్ల రూపాయల ధర పలికే ఆటగాడిని మనం చూడలేమని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పాడు.
రమీజ్ రాజ్ చెప్పిన మార్కెట్ శక్తులే దీనిని ఆమోదించవని, పీఎస్ఎల్, బీబీఎల్, ది హండ్రెడ్, సీపీఎల్ ఏదీ కూడా ఐపీఎల్కు పోటీ ఇవ్వలేదు ఆకాశ్ చోప్రా తేల్చి చెప్పాడు. ప్రసారం హక్కుల ద్వారా మీకు ఎంత డబ్బు వస్తుందని ప్రశ్నించాడు. జట్లను ఎంత ధరకు అమ్ముతారని, మీరు ఆడే దాని ప్రకారం మీ మొత్తం పర్స్ ఉంటుందని ఆయన రమీజ్ రాజాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయని, అవి విడివిడిగా ఉండవని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ ఆర్థికంగా పాకిస్థాన్ క్రికెట్ మరింత బలంగా మారాలంటే కొత్త ఆస్తులు కూడగట్టుకోవాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పీఎస్ఎల్, ఐసీసీ నుంచి తప్ప ఇతర మార్గాల నుంచి నిధులు రావడం లేదన్నాడు. అందుకే వచ్చే ఏడాది నుంచి పీఎస్ఎల్ను వేలం పద్దతిలో నిర్వహించాలని ఆయన అభిప్రాయడపడ్డాడు. అప్పుడు తమ ఎకానమీతోపాటు గౌరవం కూడా పెరుగుతుందని అన్నాడు. అప్పుడు పీఎస్ఎల్ను కాదని ఐపీఎల్ ఎవరు ఆడతారో చూద్దామని రమీజ్ రాజా వ్యాఖ్యానించారు. అయితే పీఎస్ఎల్లో డ్రాఫ్ట్ సిస్టమ్లో భాగంగా ఒక్కో ఫ్రాంఛైజీ 16 మంది ఆటగాళ్లను దక్కించుకుటుంది. వీటిలో ప్లాటినమ్, డైమండ్, గోల్డ్, సిల్వర్, ఎమర్జింగ్, సప్లిమెంటరీ అనే కేటగిరీలు కూడా ఉంటాయి. కాగా పీఎస్ఎల్ 2016లో ప్రారంభమైంది.