
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఐపీఎల్కు గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది. ఈ ఏడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు ఈ పురస్కారం లభించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ మోతేరా స్టేడియం వేదికగా ఈ టైటిల్ ఫైట్ జరగగా.. రికార్డు స్థాయిలో 101, 566 మంది ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూశారు. ఓ క్రీడా ఈవెంట్కు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి అవార్డు కూడా అందజేశారు.
ఈ అవార్డు అందుకోవడంపై బీసీసీఐ సెక్రటరీ జైషా సంతోషం వ్యక్తం చేశాడు. చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. 'ఈ ఏడాది మే 29న నరేంద్రమోదీ మోతేరా స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 ఫైనల్కు అత్యధికంగా 101,566 మంది ప్రేక్షకులు హాజరవ్వడం.. ఇది గిన్నిస్ బుక్ రికార్డుకెక్కడం ఆనందంగా గర్వంగా ఉంది. దీన్ని సాకారం చేసిన అభిమానులకు బిగ్ థ్యాంక్స్'అని జై షా పేర్కొన్నాడు.
బీసీసీఐ సైతం ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేసింది. 'భారత్ గిన్నిస్ రికార్డు సృష్టించడం ప్రతీ ఒక్కరికి గర్వకారణం. ఇది క్రికెట్ అంటే మా అభిమానులకున్న పిచ్చి, వారిచ్చిన తిరుగులేని మద్దతుకు లభించిన పురస్కారం. అందరికి అభినందనలు'అని బీసీసీఐ ట్వీట్ చేసింది. గతంలో అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియం సీటింగ్ కెపాసిటీ 49 వేలు మాత్రమే ఉండేది. అయితే స్టేడియాన్ని ఆధునీకరణ చేసిన తర్వాత లక్షా 32 వేలకు సీటింగ్ కెపాసిటీని పెంచారు. పేరును కూడా నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరిగే అవకాశాలున్నాయి.