ఢిల్లీ కేపిటల్స్ చేతిలో..
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలిసారిగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్-32, మిఛెల్ మార్ష్-63, లలిత్ యాదవ్-24, చివర్లో అక్షర్ పటేల్-17 మాత్రమే బ్యాట్ ఝుళిపించారు. ఈ టార్గెట్ను ఛేదించడంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 142 పరుగులు చేయగలిగారంతే.
వార్నర్కు కళ్లెం వేసినా..
ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ చేస్తూ వస్తోన్న డేవిడ్ వార్నర్ను ఇన్నింగ్ తొలి బంతికే అవుట్ చేసినప్పటికీ- దాన్ని పెద్దగా సొమ్ము చేసుకోలేకపోయారు పంజాబ్ బౌలర్లు. ఢిల్లీ కేపిటల్స్ పోరాడదగ్గ స్కోర్ చేయగలిగిందంటే అది బౌలర్ల వైఫల్యమే. లోయర్ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సకాలంలో పెవిలియన్ పంపించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టాప్ ఆర్డర్, టాప్ మిడిలార్డర్ బ్యాటర్లు మంచి స్కోర్ సాధించారు. సర్ఫరాజ్ ఖాన్-32, మిఛెల్ మార్ష్-63, లలిత్ యాదవ్-24 పరుగులు చేశారు.
మిడిల్ ఓవర్లల్లో..
మిడిల్ ఓవర్లల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విఫలం అయ్యారు. 4-10 ఓవర్లలోనే ఆ జట్టు పరాజయం ఖాయమైంది. ఏకంగా ఆరుమంది బ్యాటర్లు ఈ ఓవర్ల మధ్యే వెనుదిరిగారు. నాలుగో ఓవర్లో జాని బెయిర్స్టో ఈ వికెట్ల పతనం ఆరంభమైంది. ఆరో ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. ఆ ఓవర్ నాలుగో బంతికి భానుక రాజపక్స, ఆరో బంతికి శిఖర్ ధవన్ పెవిలియన్ చేరారు. ఏడో ఓవర్లో మయాంక్ అగర్వాల్, ఆ తరువాతి ఓవర్లో లియామ్ లివింగ్స్టొన్ చేతులెత్తేశారు. 10వ ఓవర్లో హర్ప్రీత్ బ్రార్ అవుట్ కావడంతో జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది.
నిలకడలేమికి..
అంతకుముందు మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఇదే పంజాబ్ కింగ్స్ 209 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంత భారీ స్కోర్ చేసిన జట్టు ఇదేనా అనిపించిందీ మ్యాచ్లో. ఒక గెలుపు-ఒక ఓటమి సీక్వెన్స్కు కట్టుబడి ఉన్నట్టు, ఎంతో కమిట్మెంట్ ఓడినట్టనిపించింది. జానీ బెయిర్స్టో-28, శిఖర్ ధవన్-19తో ఇచ్చిన 38 పరుగుల భాగస్వామ్యాన్ని విజయంగా మలచుకోలేకపోయింది పంజాబ్. భానుక-4, లియామ్ లివింగ్స్టొన్-4, మయాంక్ అగర్వాల్-0, హర్ప్రీత్ బ్రార్-1, రిషి ధవన్-4 పరుగులు చేశారు.
మిడిలార్డర్లో జితేష్ నిలదొక్కుకున్నా..
మిడిలార్డర్లో వికెట్ కీపర్ జితేష్ శర్మ నిలదొక్కుకోవడం, లోయర్ ఆర్డర్లో బౌలర్ రాహుల్ చాహర్ అతనికి సహకరించడం వల్ల ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగిందీ జట్టు. జితేష్ శర్మ-44, రాహుల్ చాహర్-25 పరుగులు చేశారు. 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు జితేష్. ఇందులో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. దూకుడుగా ఆడుతున్న అతనికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో అండగా నిలిచే బ్యాటర్ కరవయ్యాడు. చివర్లో రాహుల్ చాహర్ పోరాడినప్పటికీ.. ఫలితం దక్కలేదు.
సన్రైజర్స్తో ఫైనల్ ఫైట్..
ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ.. అవకాశం ఇంకా ఉండనే ఉంది పంజాబ్కు. లీగ్ దశలో తన చిట్టచివరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టాల్సి ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి ఈ జట్టు ఖాతాలో. సన్రైజర్స్పై గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరువ అవుతుంది. సన్రైజర్స్ మాత్రం- ఇవ్వాళ్టి ముంబై ఇండియన్స్ మ్యాచ్తో పాటు.. పంజాబ్ కింగ్స్ను ఓడించగలిగితేనే 14 పాయింట్లు సాధించగలుగుతుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారిందీ జట్టు.