రైనాకు నో చాన్స్..
ఒకవేళ మెగా వేలం జరిగితే గనుక జట్లలోని ఆటగాళ్లంతా మారిపోనున్నారు. మెగా ఆక్షన్ నిబంధనల ప్రకారం ఒక్క జట్టు ఐదుగురు ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు. ఇందులో ఒక ఫారిన్ ప్లేయర్ను కలుపుకొని మొత్తం ముగ్గురిని నేరుగా తీసుకునే అవకాశం ఉండగా.. మరో ఇద్దరిని రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) ద్వారా తీసుకోవచ్చు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత జట్టు పరిశీలిస్తే రిటైన్ జాబితాలో సురేశ్ రైనా పేరు ఉండకపోవచ్చు. ఆ జట్టు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా.. ధోనీ, దీపక్ చాహర్లను ఆర్టీఎమ్ ద్వారా తీసుకునే చాన్స్ ఉంది. సురేశ్ రైనా రూ.11 కోట్లు భారీ కాంట్రాక్టుతో పాటు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకిన నేపథ్యంలో చెన్నై అతనిపై ఆసక్తి చూపకపోవచ్చు. ఇదే జరిగి రైనా వేలానికి అందుబాటులోకి వస్తే మాత్రం ఇతర ఫ్రాంచైజీలు పోటీపడుతాయి. ముఖ్యంగా ఓ మూడు జట్లు అయితే రైనా కోసం వేలంలో ఏందాకైనా తెగించనున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్..
ఐపీఎల్లో అత్యంత అనుభవం కలిగిన సురేశ్ రైనా కోసం సన్రైజర్స్ హైదరబాద్ పోటీపడవచ్చు. ముఖ్యంగా ఆ జట్టు మిడిలార్డ్ బలహీనతతో పాటు అనుభవం లేని భారత ఆటగాళ్లతో సమస్యలను ఎదుర్కొంటుంది. గెలిచే మ్యాచ్లను కూడా చేజేతులా చేజార్చుకుంది. ఓవర్సీస్ ఆటగాళ్లపైనే పూర్తిగా ఆధారపడిన ఆ జట్టు.. వారిపై భారం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. అందుకు వేలంలో రైనా లాంటి ఆటగాళ్లపై దృష్టి సారించే అవకాశం ఉంది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ ఓవర్సీస్ విభాగం బలంగా ఉన్నా. భారత ఆటగాళ్ల అనుభవలేమి జట్టును దెబ్బతీస్తోంది. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యానికి తోడు యువ ఆటగాళ్ల అనుభవలేమి జట్టు పరాజయాలకు కారణమైంది. సురేశ్ రైనాను జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్య తీరే చాన్స్ ఉండటంతో అతని కోసం ఆరెంజ్ ఆర్మీ గట్టిగానే ప్రయత్నించనుంది.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్ రాయల్స్ది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితే. ఆ జట్టు కూడా అనుభవం కలిగిన ఆటగాళ్ల కోసం ఎదురు చూస్తుంది. రాజస్థాన్ జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ సంజూ శాంసన్తో పాటు రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, చేతన్ సకారియా, శ్రేయస్ గోపాల్ వంటి దేశవాళీ స్టార్లు ఉన్నారు. ఈ క్రమంలో ఆ జట్టు ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సుదీర్ఘ అనువం కలిగిన సురేశ్ రైనా కోసం పోటీ పడవచ్చు. గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న రాజస్థాన్.. సురేశ్ రైనా రాకతో మరింత బలంగా తయారీ కానుంది. ఈ క్రమంలోనే ఈ వెటరన్ బ్యాట్స్మన్ కోసం రాజస్థాన్ ఎంతకైనా తెగించే అవకాశం ఉంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్..
మెగా వేలంలో సురేశ్ రైనా కోసం పోటీపడే మరో టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అతనికి తోడు టాపార్డర్ రాణిస్తున్నా.. మిడిలార్డర్ మాత్రం దారుణంగా విఫలమవుతుంది. ఈ సమస్యతోనే ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని భారీ స్కోర్లుగా మలచలేకపోతుంది. దాంతో సురేశ్ రైనా లాంటి సీనియర్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ తీసుకోవాలని భావిస్తోంది. ఐపీఎల్ 2021 వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లంతా నిరాశపర్చడంతో ఆ జట్టు మెగావేలంపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే సురేశ్ రైనా వేలంలోకి వస్తే ఎంతటి ధరనైనా చెల్లించేందుకు సిద్దంగా ఉంది.