కోహ్లీ ఏమరపాటు:
ఇయన్ బిషప్ సమక్షంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్ సారథి సంజు శాంసన్ టాస్ వేయడానికి మైదానానికి వచ్చారు. కోహ్లీ కాయిన్ను గాల్లోకి వేయగా.. శాంసన్ తన ఆప్షన్ చెప్పాడు. టాస్ గెలిచిన కోహ్లీ.. మొదట తాను టాస్ ఓడిపోయినట్లు భావించి సంజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి వెళ్లాడు. దాంతో సంజు ముందుకు వచ్చి తన నిర్ణయం ప్రకటించబోయాడు. ఇంతలోనే తన తప్పిదాన్ని గ్రహించిన కోహ్లీ.. రియాక్ట్ అయ్యి నవ్వుకుంటూ ముందుకు వచ్చాడు. అయ్యో.. టాస్ నేనే గెలిచా కదా అంటూ ముందుకువచ్చి సంజు దగ్గరి మైక్ అందుకుని.. తాము బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు.
టాస్ గెలవడం నాకు అలవాటు లేదు:
టాస్ గెలిచినా అలా వెళ్లిపోయావ్ ఏంటి విరాట్ కోహ్లీ అని ఇయన్ బిషప్ సరదాగా అడిగాడు. 'నేను టాస్ గెలిచా? అని అనుకోలేదు. ఎందుకంటే.. టాస్ గెలవడం నాకు అలవాటు లేదు' అని కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు. ఆపై సంజు శాంసన్ వచ్చి ఓ ముసిముసి నవ్వు నవ్వి.. ఉనద్కత్ స్థానంలో గోపాల్ను తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. ఈ సరదా ఘటన చూసిన మైదానంలోని వారు నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసి హాయిగా నవ్వుకోండి.
మూడు మ్యాచ్ల్లో విజయం:
ఈ సీజన్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అన్నింటిలోనూ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు ఒక సీజన్లో మొదటి మూడు మ్యాచ్లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఐపీఎల్ 2014 సీజన్లో మొదటి రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధించింది. గత సీజన్లలో జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా.. వారికి శుభారంభాలు దక్కలేదు. ఈసారి గ్లెన్ మాక్స్వెల్ రాకతో విజయాల బాట పట్టింది.
|
ఆదిలోనే ఎదురు దెబ్బ:
ఈ మ్యాచ్లో రాయల్స్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మహ్మద్ సిరాజ్ సూపర్ బంతులతో తన వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్లో జోస్ బట్లర్ (8)ను బౌల్డ్ చేసిన సిరాజ్.. ఐదో ఓవర్లో డేవిడ్ మిల్లర్ను (0) పెవిలియన్ పంపాడు. కైల్ జేమీసన్ కూడా నాలుగో ఓవర్లో మనన్ వోహ్రా (7)ను ఔట్ చేశాడు. దీంతో రాజస్థాన్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సంజూ శాంసన్ (12) నిలకడగా ఆడుతున్నాడు. మరో ఎండ్లో శివమ్ దూబే (4) ఉన్నాడు. పవర్ప్లే ఆఖరికి రాజస్థాన్ 3 వికెట్లకు 32 పరుగులు చేసింది.