ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి ముందు మరో షాక్ తగిలింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. మైదానంలో పనిచేసే ఓ ప్లంబర్తో పాటు ఇద్దరు గ్రౌండ్ సిబ్బందికి పాజిటివ్గా తేలిందని ముంబై క్రికట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ ప్రకటనలో పేర్కొంది. ముంబైలో షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ 2021 మ్యాచ్ల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజే.. మరో ముగ్గురు కరోనా బారిన పడటం గమనార్హం.
గతంలో వాంఖడే స్టేడియంలో పని చేసే పది మంది సిబ్బందికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. వాళ్లకిప్పుడు నెగెటివ్గా తేలిందని సమాచారం. అయితే తొలుత సిబ్బందికి కరోనా వచ్చిందని తెలిశాక స్టేడియం పరిసరాలను శుభ్రం చేశారు. టోర్నీని సజావుగా నడిపే ఉద్దేశంతో మైదాన సిబ్బంది స్టేడియంలోనే ఉంటున్నారని, ప్రయాణాలు చేయడం లేదని ఎంసీఏ స్పష్టం చేసింది. అయినా తాజాగా మరో ముగ్గురు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
ముంబైలో యథాతథంగా మ్యాచ్లు నిర్వహిస్తామని బీసీసీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించాయి. ముంబైలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో సోమవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతంలో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2021లో పాల్గొనే ఆటగాళ్లకు మాత్రం రాత్రి 8 తర్వాత ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.
ఐపీఎల్ 14వ సీజన్ మరో మూడు రోజులో ప్రారంభం కానుంది. ప్రధాన నగరాల్లో బయో బాబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం అయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ ప్రారంభం కానుంది. మరుసటి రోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడనున్నాయి. ప్రస్తుతం ఏ జట్టు కూడా వాంఖడే స్టేడియంలో సాధన చెయ్యట్లేదు. డివై పాటిల్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి.