ఇంతకంటే ఏం చేయగలను
మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ... 'అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. విజయానికి అత్యంత చేరువగా వెళ్లాం. కానీ దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదు. ఇంతకంటే నేను ఏం చేయగలను. ఆటలో ఇవన్నీ సహజమే. వికెట్ మెరుగు పడుతుంది.. టార్గెట్ను సులభంగా ఛేదించగలమని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. మేము మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అందరూ బాగా ఆడారు' అని అన్నాడు. వీరోచిత సెంచరీ బాదిన శాంసన్ (119: 63 బంతుల్లో 12x4, 7x6)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.
రిఫరీ వద్దన్నాడు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గురించి సంజు శాంసన్ మాట్లాడుతూ... 'ఇన్నింగ్స్ ద్వితీయార్థం అత్యద్భుతంగా సాగింది. నేను ఇప్పటివరకు ఆడిన ఉత్తమ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఆచితూచి ఆడుతూ.. సింగిల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొట్టాను. బ్యాటింగ్ను పూర్తిగా ఆస్వాదించాను. నా నైపుణ్యాలను చక్కగా వినియోగించుకున్నపుడు కచ్చితంగా ఇలాంటి ప్రదర్శన ఇవ్వగలనని తెలుసు. ఈ క్రమంలో ఒక్కోసారి వికెట్ కోల్పోతాను కూడా. అయినా కూడా నా నాచురల్ గేమ్ ఆడుతాను. ఈ నాటి మ్యాచ్లో నా ఇన్నింగ్స్ సంతృప్తికరంగా సాగింది. ఇక టాస్ వేసిన నాణెం బాగుంది. అందుకే జేబులో వేసుకున్నా. తీసుకోవచ్చా అని రిఫరీని అడిగితే వద్దన్నాడు' అని తెలిపాడు.
చివరి బంతికి ఔట్
రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో సంజు శాంసన్, క్రిస్ మోరిస్ ఉన్నారు. అర్ష్దీప్ సింగ్ చేతిలో బాల్ ఉంది. దీంతో అప్పటి జోరు చూస్తే.. రాయల్స్ సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్నారు. మొదటి బంతికి పరుగు రాకున్నా.. రెండో బంతికి శాంసన్ సింగల్ తీశాడు. మూడో బంతికి మోరిస్ మరో సింగల్ తీశాడు. ఇక నాలుగో బంతికే శాంసన్ సిక్స్ బాదడంతో ఉంత్కంఠ తారాస్థాయికి చేరింది. ఐదవ బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా.. శాంసన్ తీయలేదు. ఇక చివరి బంతికి రాయల్స్ కెప్టెన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రాయల్స్ ఆశలు అడిఆశలయ్యాయి.