చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరుమీదుంది. ఎలాగైనా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ పట్టాలని చూస్తోంది. అంతేకాదు ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోహ్లీసేన ఐపీఎల్ 2021లో ప్రతీ మ్యాచ్లోనూ సమిష్టిగా రాణిస్తోంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ పరుగుల వరదపారిస్తున్నారు. బౌలింగ్లో మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్ రాణిస్తుండడంతో ఇప్పటికే ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక సీజన్లో మొదటి మూడు మ్యాచ్లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఐపీఎల్ 2014 సీజన్లో మొదటి రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ విజయం సాధించింది. గత సీజన్లలో జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా.. వారికి శుభారంభాలు దక్కలేదు. ఈసారి గ్లెన్ మాక్స్వెల్ రాకతో విజయాల బాట పట్టింది. మరోవైపు కోల్కతాతో జరిగిన చివరి మూడు మ్యాచ్ల్లోనే కోహ్లీసేన ఘన విజయం సాధించడం విశేషం.
టోర్నీ మొదటి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ను ఆర్సీబీ ఓడించింది. ముంబై 159 పరుగులు చేయగా.. కోహ్లీసేన చివరి బంతికి విజయం సాధించింది. డివిలియర్స్ 27 బంతుల్లో 48 రన్స్ చేశాడు. రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ని ఆర్సీబీ మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 149 రన్స్ చేయగా.. సన్రైజర్స్ 143 పరుగులకే పరిమితమైంది. షాబాజ్ అహ్మద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు.
ఇక ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో బెంగళూరు 38 పరుగుల తేడాతో కోల్కతాను చిత్తుచేసింది. మ్యాక్స్వెల్ (78), డివిలియర్స్ (76 నాటౌట్) మెరుపులతో తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 204/4 స్కోరు చేసింది. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశారు. భారీ లక్ష్యఛేదనలో తడబడిన కోల్కతా 166/8 స్కోరుకే పరిమితమైంది. రసెల్ (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో జెమీసన్ మూడు వికెట్లు పడగొట్టాడు.