ముంబై: గురువారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి చెందడంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసహనం వ్యక్తం చేశాడు. గెలుపు అంచుల వరకూ వెళ్లి పరాజయం చెందడం జట్టు తప్పిదంగా పాంటింగ్ పేర్కొన్నాడు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు నాలుగో ఓవర్ ఇవ్వకపోవడం పొరపాటేనని అంగీకరించాడు. క్రిస్ మోరిస్కు తమ పేసర్లు యార్కర్లు వేసుంటే ఫలితం మరోలా ఉండేదని రికీ అభిప్రాయపడ్డాడు. వాంఖడే మైదానంలో ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఆఖరి ఓవర్లో ఛేదించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఢిల్లీ మ్యాచుపై పూర్తి పట్టు సాధించినా.. చివరలో సొంత తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచులో 3 ఓవర్లు వేసిన రవిచంద్రన్ అశ్విన్ 14 పరుగులే ఇచ్చాడు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. 54 బంతుల్లో 92 పరుగులు అవసరమైన క్రమంలో అశ్విన్ మూడో ఓవర్ పూర్తి చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అతడికి మరో ఓవర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. 'మ్యాచుపై సమీక్ష చేసేటప్పుడు ఈ విషయం గురించి కచ్చితంగా మాట్లాడతా. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చాడు. తొలి మ్యాచులో నిరాశపరిచినా.. ఈ పోరులో అదరగొట్టాడు. అతడికి తర్వాత బౌలింగ్ ఇవ్వాల్సింది. ఇది పొరపాటే' అని రికీ పాంటింగ్ అన్నాడు.
'క్రిస్ మోరిస్కు మేం కొన్ని సులువైన బంతులు విసిరాం. ఎక్కువ స్లాట్ బంతులు విసిరాం. అవసరమైన లెంగ్తుల్లో బంతులు వేయలేదు. నిజానికి అతడికి యార్కర్లు వేసుంటే పరుగులు చేసేవాడు కాదు. సరైన లెంగ్తుల్లో, వికెట్ల ఎత్తులో బంతులు వేసుంటే.. వేగం తగ్గిస్తే బాగుండేది. కానీ మేం అలా చేయలేదు. ఎవరికైనా బంతుల్ని స్లాట్లో వేస్తే కచ్చితంగా హిట్ చేస్తారు. అందులోనూ చావో రేవో పరిస్థితుల్లో ఈ తరహా బంతులు సరైనవి కావు' అని పాంటింగ్ తెలిపాడు. 18 బంతులు ఆడిన మోరిస్ 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇషాంత్ శర్మ స్థానాన్ని అవేష్ ఖాన్ పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాడని ఆశిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. ఇషాంత్ అనుభవం జట్టుకు అవసరమొస్తుందని అభిప్రాయపడ్డాడు. క్రిస్ వోక్స్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్, టామ్ కర్రన్లతో బౌలింగ్ విభాగం బలంగా ఉందన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉన్నాడని రికీ చెప్పాడు.