న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తమ టీమ్ క్రికెట్ డైరెక్టర్గా.. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరను నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. జట్టుకు సంబంధించిన క్రికెట్ కార్యకలపాలన్నిటిని సంగక్కర పర్యవేక్షించనున్నాడు. కోచింగ్ స్ట్రక్చర్, యాక్షన్ ప్లాన్, టీమ్ స్ట్రాటజీ, ప్రతిభాన్వేషణ, టీమ్ డెవలప్మెంట్తో పాటు నాగ్పూర్లో ఉన్న రాయల్స్ అకాడమీ అభివృద్ధి పనులన్నీ కూడా సంగక్కర చేతుల మీదుగానే జరగనున్నాయి.
అయితే ఈ కొత్త బాధ్యతలు తనకి ప్రేరణ కలిగిస్తున్నాయని సంగక్కర తెలిపాడు. 'ప్రపంచంలో అత్యంత పోటీ ఉండే ఈ లీగ్లో ఓ ఫ్రాంఛైజీ తరఫున క్రికెట్ వ్యూహాల్ని పర్యవేక్షించడం, జట్టును తయారుచేయడానికి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం.. వంటి లక్ష్యాలు నన్ను ఎంతో ప్రేరేపిస్తున్నాయి'' అని సంగక్కర పేర్కొన్నాడు. తమ బృందంలో చేరడంపై రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ స్పందించాడు. ఆల్టైమ్ గొప్ప వికెట్కీపర్ తమ జట్టులో ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 28వేలకు పైగా పరుగులు సాధించిన సంగక్కర్ ఐపీఎల్లో హైదరాబాద్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, ఇటీవల అన్ని ఫ్రాంఛైజీలు రిటైర్డ్, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను వదిలేసుకుంది. యువ వికెట్కీపర్ శాంసన్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే రాజస్థాన్ స్మిత్తో పాటు అంకిత్ రాజ్పుత్, ఒషేన్ ధామస్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ధ జోషి, ఆకాశ్ సింగ్, శశాంక్ సింగ్ను వదులుకుంది.