సమయం పడుతుంది:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రిషబ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రియాన్ పరాగ్ వంటి యువకులు అద్భుతంగా రాణిస్తున్నారు. తమ జట్లు విజయం సాధించేందుకు అవసరమైన పరుగులు చేస్తున్నారు. విధ్వంసకరంగా ఆడుతున్నారు. వీరు భారత జట్టులో స్థిరపడాలంటే సమయం పడుతుందని ప్రజ్ఞాన్ ఓజా అంటున్నాడు. నిలకడగా రాణిస్తేనే అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నాడు. తాజాగా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ యువ ఆటగాళ్ల ప్రదర్శనపై స్పందించాడు. శాంసన్, పంత్ జట్టు పగ్గాలు అందుకోవడం బాగుందన్నాడు. వారిలో మంచి టాలెంట్ ఉందని పేర్కొన్నాడు.
వారు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డు లాంటివారు:
'మీరు సంజు శాంసన్ గురించి మాట్లాడితే.. ఒక విషయం గమనించాలి. తొలిసారి టీమిండియాకి అతడు ఎంపికైనప్పుడు జట్టులో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లేరు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు గురించి మాట్లాడాలంటే.. నేను మీకో ఆసక్తికరమైన కథ చెబుతాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డు లాంటివారు. బిల్లులు కట్టకపోయినా మరికొన్ని రోజులు వాడుకొనే సౌలభ్యం ఉంటుంది' అని ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఓజా ఆడిన విషయం తెలిసిందే.
గడువులోపే వాడుకోవాలి:
'కుర్రాళ్లు మాత్రం ప్రీ పెయిడ్ సిమ్ కార్డులు. గడువులోపే వాడుకోవాలి. లేదంటే సిమ్ పని చేయకుండా పోతుంది. వారు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు కాదని కుర్రాళ్లు తెలుసుకోవాలి. వాళ్లు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు కావాలంటే నిలకడగా ప్రదర్శన చేయాలి' అని టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓజా 16 సంవత్సరాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. అయితే 2013 నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ.. 2019 వరకు దేశీయ క్రికెట్ ఆడారు. 2013లో ముంబైలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ప్రజ్ఞాన్ ఓజా చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు.