గాయం వల్ల దూరం..
ఐపీఎల్లో ఆడటానికి క్రికెటర్లు ప్రిపేర్ అవుతోన్నారు. అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉంటోన్న ప్లేయర్లు ఫిట్నెస్పై ఫోకస్ పెట్టారు. ఆస్ట్రేలియా కేప్టెన్ ఆరోన్ ఫించ్ ఇప్పటికే మోకాలి సర్జరీకి రెడీ అవుతున్నాడు. దీనికోసం అతను బంగ్లాదేశ్ పర్యటనను వదులుకున్నాడు. వెస్టిండీస్ సిరీస్ మధ్యలో నుంచే వైదొలగాడు. ఇదే క్రమంలో తాజాగా- శ్రేయాస్ అయ్యర్ పేరు తెర మీదికి వచ్చింది. గాయం కారణంగా క్రికెట్కు దూరంగా ఉంటోన్న అతను సుదీర్ఘ విరామం అనంతరం గ్రౌండ్లో అడుగు పెట్టాడు. ట్రైనింగ్లో పాల్గొంటొన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రె గైడెన్స్లో అతను ఫిట్నెస్ ట్రైనింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
నాలుగు నెలల పాటు
గాయం కారణంగా నాలుగు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉంటోన్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. శ్రీలంక టూర్ కోసం కూడా సెలెక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు. ఫలితంగా పరుగుల ఆకలి మీదున్నట్టు కనిపిస్తోన్నాడతను. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఇంకా అతను ఫిట్నెస్ సర్టిఫికెట్ను తీసుకోవాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్ ఉంటే గానీ.. టోర్నమెంట్ల కోసం అతని పేరును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ పరిశీలనలోకి తీసుకోదు. ముంబై క్రికెట్ అసోసియేషన్కు చెందిన బీకేసీ ఫెసిలిటీ సెంటర్లో అతను ఈ నెల 31వ తేదీ వరకు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 22న ఎస్ఆర్హెచ్తో ఢిల్లీ మ్యాచ్..
శ్రేయాస్ అయ్యర్ వందశాతం ఫిట్నెస్ సాధించినట్లు ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ చెబుతోంది. సర్టిఫికెట్ రావడం లాంఛనప్రాయమేనని అభిప్రాయపడుతోంది. ఈ కారణంతోనే బ్యాటింగ్ ట్రైనింగ్పైనా అతను దృష్టి సారించినట్లు పేర్కొంది. డీసీ బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రె సారథ్యంలో అయ్యర్ ప్రాక్టీస్ చేస్తోన్నాడని తెలిపింది. ఐపీఎల్ 2021 ఫేస్ 2లో ఢిల్లీ కేపిటల్స్ తన తదుపరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆరంభమౌతుంది. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్కు రిషభ్ పంత్ కేప్టెన్గా ఉంటోన్నాడు.