ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ ఎక్స్-ఫ్యాక్టర్గా మారతాడని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. స్వతహాగా పంత్ ప్రతిభావంతుడని, ఎంఎస్ ధోనీతో పోలికల వల్ల ఇబ్బంది పడ్డాడన్నాడు. భారత యువ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. అయ్యర్ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది.
స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో భాగంగా పార్థివ్ పటేల్ మాట్లాడుతూ... 'ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంతే ఎక్స్-ఫ్యాక్టర్. గత సీజన్కు అతడు అత్యుత్తమ ఫామ్లో లేడు. అయినా కూడా కొన్ని మ్యాచులలో బాగానే ఆడాడు. ఈసారి టీమిండియాకు మాత్రం అదరగొట్టాడు. ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతాలు చేశాడు. అదే ఆత్మవిశ్వాసాన్ని ఐపీఎల్ టోర్నీకి కూడా తీసుకొస్తున్నాడు. నిజానికి టీ20లకు కావాల్సింది అదే. ఎందుకంటే మనసులో ఎలాంటి సందేహాలూ ఉండకూడదు. ముఖ్యంగా పంత్ లాంటి ఆటగాడికి అస్సలు ఉండొద్దు' అని అన్నాడు.
'టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పోలికల వల్ల రిషబ్ పంత్పై అధిక భారం పెరిగింది. అందుకు తగ్గట్టే పంత్ ప్రయత్నించాడు. వాస్తవంగా పంత్ స్వయంగా ప్రతిభాశాలి. ధోనీలా ఆడాలని అతడు ఆందోళన చెందకూడదు. ఎందుకంటే అతడు మహీ కన్నా మెరుగ్గా ఆడొచ్చు లేదా కుదిరిన ప్రతిసారీ మ్యాచులు గెలిపించొచ్చు' అని పార్థివ్ పటేల్ తెలిపాడు. ఢిల్లీ కెప్టెన్గా పంత్ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా పంత్ సరైనోడని కితాబిస్తున్నారు. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, చెన్నై ఆటగాడు సురేశ్ రైనా, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సహా అనేక మంది పంత్ సారథిగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషభ్ పంత్ తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధ శతకాలు సాధించాడు. ఇదే ఫామ్ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది.
2011 World Cup: 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి తెర.. ఎంఎస్ ధోనీ ఎవర్గ్రీన్ సిక్సర్కు పదేళ్లు!!