ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేదికల జాబితా నుంచి ముంబైని తొలగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడమే ఇందుకు అసలు కారణం. అదే నిజమైతే ముంబై బయట ఐపీఎల్ జరగడం ఇదే తొలిసారి అవుతుంది. పైగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే కావడం విశేషం. ముంబై స్థానంలో హైదరాబాద్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ 2020ని యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది సీజన్ను మాత్రం సొంతగడ్డపైనే నిర్వహించాలని నిర్ణయించింది. లీగ్ దశ మ్యాచ్లను చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్లను మాత్రం అహ్మదాబాద్లోని మోతేరాలో జరపాలని ప్లాన్ చేస్తోంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ వద్దని బీసీసీఐ, ఐపీఎల్ అధికారులు చర్చించినట్లు సమాచారం. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన లెక్కల ప్రకారం.. అక్కడ 78212 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దాంతో బీసీసీఐ పునరాలోచనలో పడింది.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీలు కూడా తమ సొంత మైదానాలు ఉన్న హైదరాబాద్, జైపూర్, మొహాలిలో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఆరు సిటీల జాబితా నుంచి ముంబైని తప్పిస్తే.. అప్పుడు రేసులో హైదరాబాద్, జైపూర్, మొహాలి నిలిచే అవకాశం ఉంది. ఆటగాళ్ల ప్రయాణం, ఆతిథ్యం పరంగా చూసుకుంటే.. జైపూర్, మొహాలి కంటే హైదరాబాద్ ముందు నిలిచే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్, హెచ్సీఏ తరఫున అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కూడా ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచులను హైదరాబాద్లో నిర్వహించడానికి బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అహ్మదాబాద్లో భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ అనంతరం బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
India vs England: టీమిండియాకు భయం ఎందుకు.. ఫెయిర్ పిచ్లపై ఫెయిర్గా ఆడాలి: అక్తర్