దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. హోరాహోరీగా సాగే ఈ మ్యాచ్తో రెండో దశ సీజన్కు గొప్ప ఆరంభం ఖాయం. ఇప్పటికే మెగా టోర్నీ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ముఖ్యంగా చెన్నై ప్లేయర్స్. గత నెల రోజులుగా యూఏఈలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ్యాచుకు ముందు ముంబైకి హెచ్చరికలు జారీ చేశాడు.
ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు శనివారం రాత్రి సాధన చేశారు. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ దగ్గరుండి మరి ప్రాక్టీస్ చేయించాడు. ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ మ్యాచ్లో చెలరేగాడు. అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే బ్యాట్కి పనిచెప్పాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరిపై విరుచుకుపడ్డాడు. బౌండరీలతో పాటుగా 8 సిక్సర్లు కొట్టి అలరించాడు. లాంగ్ ఆన్ మీదుగా చాలా సిక్సర్లు బాదాడు. ఇందులో ఒకటి హెలికాప్టర్ షాట్ కూడా ఉంది. దాంతో ఈ రోజు మ్యాచుకు ముందు మహీ ముంబై జట్టుకు హెచ్చరికలు జారీచేశాడు. మహీ సిక్సులకు సంబందించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది.
ఈ రోజు దుబాయ్లో ముంబై, చెన్నై తలపడనున్నాయి. ఈ మైదానంలో ముంబై జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే అందుకుంది. ఈ మూడు విజయాలు కూడా ఢిల్లీ క్యాపిటల్స్పై నమోదు చేసింది. ఇక చెన్నై ముందు ఉన్న లక్ష్యం ఏంటంటే.. ఇండియాలో తొలి దశలో ఎదురైనా పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడం. చెన్నై భారీ స్కోర్ చేసినా.. పోలార్డ్ విధ్వంసం కారణంగా ధోనీసేన మ్యాచ్ ఓడిపోయింది. ఐపీఎల్ 2021 మొదటి దశ తర్వాత చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 7 మ్యాచులకు గాను 5 గెలిచి గెలిచి 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ముంబై నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నై మూడింటిలో, ముంబై నాలుగింటిలో గెలవాల్సి ఉంది.
ముంబై, చెన్నై జట్లు ఇప్పటి వరకూ 32 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందగా.. మిగిలిన 13 మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించింది. గత కొంత కాలంగా చెన్నైపై ముంబై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో చెన్నై గెలవడం కష్టంగా మారింది. ఓవరాల్గా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. మరి దుబాయ్ వేదికగా జరుగనున్న పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు. అయితే మంచు ప్రభావం మాత్రం ఉండనుంది. మొదట్లో పేసర్లకు అనుకూలించే పిచ్.. ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే ఆస్కారముంది.
All arealayum Thala...🥳#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/Zu85aNrRQj
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) September 18, 2021
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా):
ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్ మరియు వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, జోష్ హాజెల్వుడ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్.