
ముంబై: ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మొయిన్ అలీ క్రికెట్లోకి రాకుంటే సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ జుగుప్సాకరమైన రితీలో ఆమె మంగళవారం ట్వీట్ చేసింది. తస్లీమా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆమె వ్యాఖ్యలపై పలువురు క్రికెటర్లతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, సామ్ బిల్లింగ్స్తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నిలుస్తూ ఆమెపై విరుచుపడ్డారు.
అయితే మొయిన్ అలీ మాత్రం ఇప్పటి వరకు తస్లీమా వ్యాఖ్యలపై స్పందించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం సమయాత్తం అవుతున్న అలీ.. చెన్నై సూపర్ కింగ్స్( సీఎస్కే) క్యాంప్లో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఈ సీజన్ వేలానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అలీని వదులుకోగా.. వేలంలో సీఎస్కే అతన్ని రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక సీఎస్కే ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ను ఏప్రిల్10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.