బెంచ్కే లిన్:
తొలి మ్యాచ్లో ముంబై ఓపెనర్ క్రిస్ లిన్ ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలోనే రనౌట్కి అతను కారణమయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49 పరుగులు సాధించి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు లిన్. టీ20 ఫార్మాట్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మన్గా పేరొందని లిన్.. ఈరోజటి మ్యాచ్ తుది జట్టులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కానీ క్వింటన్ డీకాక్ అందుబాటులోకి రావడంతో లిన్కు విశ్రాంతి ఇవ్వొచ్చు. ఎందుకంటే.. ముంబై జట్టు బ్యాటింగ్ బలమంతా హార్డ్ హిట్టర్లే కాబట్టి లిన్ కంటే డీకాక్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
జయంత్ యాదవ్కి ఛాన్స్:
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లాంటి భారీ హిట్టర్లు ముంబై జట్టులో ఉన్నారు. ఇందులో ఏ ఇద్దరు చెలరేగినా కోల్కతాకు చుక్కలే. గత మ్యాచులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మార్కో జాన్సన్ ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్ రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇచ్చి మ్యాచ్ ఓటమికి కారణమయ్యారు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరిపై వేటు వేసి జయంత్ యాదవ్ని టీమ్లోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కృనాల్ బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి రాహుల్పైనే వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫామ్లో రాణా:
కోల్కతా జట్టులో ఓపెనర్ నితీశ్ రాణా సూపర్ ఫామ్లో ఉన్నాడు. హైదరాబాద్పై మ్యాచ్లో దూకుడుగా ఆడి 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, షకీబ్ ఉల్ హాసన్ సత్తాచాటారు. అయితే ఓపెనర్ శుభమన్ గిల్, పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంచనాల్ని అందుకోలేకపోయారు. వీరు గాడిలో పడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగంలో కోల్కతా పాట్ కమిన్స్పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రసీద్ కృష్ణ వికెట్లు తెస్తున్నా.. భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అందరూ మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. పటిష్ట ముంబై లైనప్ ముందు చిన్నపాటి తప్పులు కూడా చేయకూడదు. సమిష్టిగా ముంబై ఆటగాళ్లను అడ్డుకుంటేనే విజయంపై నమ్మకంగా ఉండొచ్చు.
కోల్కతాపై ముంబై ఆధిపత్యం:
టోర్నీలో కోల్కతాపై ముంబై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్ల్లో తలపడగా.. ఇందులో 21 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందింది. ఆరు మ్యాచ్ల్లో కోల్కతా విజయం సాధించింది. హిట్టర్లతో నిండిన ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి మెరుగైన స్కోర్లు నమోదవుతున్నాయి. టోర్నీలో ముంబైపై కోల్కతా ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులుకాగా.. కోల్కతాపై ముంబై 210 పరుగులు చేసింది. ఐపీఎల్ 2020 సీజన్లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ ముంబై గెలిచింది.
తుది జట్లు (అంచనా):
కోల్కతా: నితీష్ రానా, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.
ముంబై: రోహిత్ శర్మ, క్రిస్ లిన్/క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్/జయంత్ యాదవ్, మార్కో జాన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.