
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో పాల్గొనేందుకు వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ సోమవారం చెన్నై చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో హోల్డర్ త్వరలోనే చేరనున్నాడు. జట్టులో చేరేముందుకు బీసీసీఐ ఎస్ఓపీల ప్రకారం.. హోల్డర్ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు. క్వారంటైన్ పూర్తైన తర్వాత కరోనా టెస్టుల్లో నెగెటివ్ వస్తే జట్టులో చేరేందుకు అనుమతిస్తారు. 'వెస్టిండీస్ నుంచి వచ్చిన బిగ్మ్యాన్కు స్వాగతం' అంటూ సన్రైజర్స్ ట్వీట్ చేసింది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ కూడా భారత్ చేరుకున్నాడు. ప్రస్తుతం రషీద్ ఏడు రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. తాజాగా రషీద్ ఓ ట్వీట్ చేశాడు. 'ఆరెంజ్ ఆర్మీ సిద్ధంగా ఉంది. అభిమానులు మీరు సిద్ధంగా ఉన్నారా?. మాస్క్ ధరించండి మరియు సురక్షితంగా ఉండండి' అని ట్వీట్ చేశాడు. సన్రైజర్స్ జట్టుకు రషీద్ కీలక అన్న విషయం తెలిసిందే. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అండగా ఉంటున్నాడు. గతేడాది16 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీసిన రషీద్.. అత్యుత్తమంగా రాణించాడు.
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. ఇక ఏప్రిల్ 11న కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సీజన్ను ఆరంభించనుంది. అయితే నలుగురు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్స్టో, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, జేసన్ రాయ్, మహ్మద్ నబీ, ముజిబుర్ రహమాన్ వంటి నాణ్యమైన విదేశీ ఆటగాళ్ల నుంచి నలుగురిని తుది జట్టులోకి ఎంపిక చేసుకోవడం సన్రైజర్స్కు సవాలే.

వార్నర్కు బెయిర్స్టో జతకలిస్తే అగ్నికి వాయువు తోడైనట్లే. వీరిద్దరి బ్యాట్లు మాట్లాడుతున్నంత సేపు మైదానంలో కేరింతలకు కొదవుండదు. అయితే వీరికి మిడిలార్డర్ నుంచి సహకారం లభించడం లేదు. మనీష్ పాండేలో నిలకడ లేకపోవడం.. ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మలకు అనుభవం లేకపోవడం ఇక్కడ అసలు లోపం. విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా అదనపు బలం. భువనేశ్వర్, నటరాజన్, సందీప్, ఖలీల్, సిద్ధార్థ్లతో పటిష్టమైన దేశీయ వనరులు అందుబాటులో ఉండడం వార్నర్ సేనకు సానుకూలాంశం.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు:
దేశీయ ఆటగాళ్లు: భువనేశ్వర్కుమార్, షాబాజ్ నదీమ్, నటరాజన్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా, కేదార్ జాదవ్, సందీప్శర్మ, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, అభిషేక్శర్మ, ఖలీల్ అహ్మద్, బాసిల్ థంపి, ప్రియం గార్గ్, శ్రీవత్స గోస్వామి, సిద్ధార్థ్ కౌల్, జగదీశ సుచిత్, విరాట్ సింగ్.
విదేశీయులు: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్స్టో, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జేసన్ హోల్డర్, జేసన్ రాయ్, ముజిబుర్ రహమాన్.