
ముంబై: మరో పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో 14వ సీజన్లో పాల్గొనే ఆటగాళ్లందరూ ఆయా జట్లలో చేరుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనను ముగించుకున్న హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ టీమ్తో చేరారు. ఆదివారం రాత్రి పూణేలో మూడో వన్డే మ్యాచ్ ముగియగానే ముగ్గురూ ముంబై బయలుదేరి వెళ్లారు. అక్కడ ముంబై జట్టు ఉన్న హోటల్కు వెళ్లి టీమ్తో కలిశారు.
పాండ్యా సోదరులు, సూర్యకుమార్ వచ్చిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. 'మా కుర్రాళ్లు పూణే నుంచి ముంబై వచ్చారు. ఇక వారి ఆట కోసం ఎదురు చూస్తున్నాం' అని ముంబై ట్వీట్ చేసింది. వీడియోలో కృనాల్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. శానిటైజ్ చేసుకున్న అనంతరం ముగ్గురూ వారి గదుల్లోకి వెళ్లిపోయారు. ఏప్రిల్ 9న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుండగా.. చెన్నైలో జరగనున్న తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో నేషనల్ టీమ్కు తొలిసారి ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా తన కల నెరవేరినట్లు చెప్పాడు. 'చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు ఆడినందుకు చాలా గర్వంగా ఉంది. నేషనల్ టీమ్కు తొలిసారి ఆడడంతో నా కల నెరవేరింది. ఆ ప్రయాణం ఎంతో గొప్పగా ఉంది. అక్కడ నా భాద్యత ముగిసింది. తిరిగి నా కుటుంబంలోకి వచ్చాను. మరోసారి ముంబై ఇండియన్స్తో నా జర్నీ మొదలైంది' అని సూర్యకుమార్ చెప్పాడు.
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వెస్టిండీస్ బ్యాట్స్మన్ హెట్మైర్ ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బసచేస్తున్న హోటల్లో చేరారు. ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారని ఫ్రాంఛైజీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ కూడా ఢిల్లీ జట్టులో చేరేందుకు ముంబైకి వచ్చేశాడు.
భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధనల ప్రకారం ముందుగా ఆటగాళ్లు, కోచింగ్, సహాయ సిబ్బంది అందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలి. ఆ తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కరోనా నెగెటివ్గా వచ్చిన వారిని మాత్రమే టీమ్ బయో బబుల్లోకి అనుమతిస్తారు. అనంతరం ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది.