
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 పండగ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 19) ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. గత ఏడాది మాదిరే ఈసారి కూడా మ్యాచ్లన్నీ దుబాయ్, అబుదాబీ, షార్జా క్రికెట్ స్టేడియాల్లో జరగనున్నాయి. రెండో దశకు ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. స్టేడియాల్లో 50 శాతం సామర్థ్యంతో అభిమానులకు టికెట్లు జారీ చేస్తోంది. యూఏఈ కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఫ్యాన్స్కు సూచించింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా మ్యాచ్లకు వేదికలైన దుబాయ్, అబుదాబి, షార్జాల్లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పలు నిబంధనలు పెట్టింది.
ఐపీఎల్ 2021 మ్యాచ్లు చూసేందుకు స్టేడియాల్లోకి వచ్చే అభిమానులు 48 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పారు. కానీ రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సిన్ధ్రువీకరణ పత్రాలను మాత్రం చూపించాల్సి ఉంటుంది. స్టేడియాల్లో సీటు సీటుకు మధ్య భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు. అయితే 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. మ్యాచ్ టికెట్లను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా.. స్టేడియాల బయట స్కానింగ్ చేస్తే సరిపోతుంది.
అబుదాబి స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు కచ్చితంగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ను తీసుకుంటేనే అనుమతి ఉంటుంది. 48 గంటల్లోపు చేసుకున్న ఆర్టీ-పీసీఆర్ కొవిడ్ రిజల్ట్ నెగటివ్ అయి ఉండాలి. 12-15 ఏళ్ల వయసున్న వారికి వ్యాక్సినేషన్ పత్రాలు లేకపోయినా.. కొవిడ్ రిపోర్ట్ తప్పనిసరి. షార్జాలో మాత్రం కొన్ని నిబంధనలు వేరుగా ఉన్నాయి. షార్జా స్టేడియంలో16 ఏళ్లు దాటిన వారినే అనుమతించనున్నారు. అంతేకాదు రెండు డోసుల వ్యాక్సినేషన్ పత్రాలు తప్పనిసరి. 48 గంటల్లోపు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ కొవిడ్ రిపోర్ట్ కూడా ఉండాలి. ఇక అభిమానులు తమ మొబైల్స్లో అల్ హోస్న్ యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి.
ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు నిర్వహించనున్న ఈ మూడు వేదికల్లో ఫాన్స్ మాస్క్ ధరించడం తప్పనిసరి. మైదానంలో భౌతికదూరాన్ని పాటించాల్సి ఉంటుంది. స్టేడియం గేట్ల వద్ద శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలుంటాయి. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే.. లోనికి అనుమతి ఉండదు. ఇక ఒక్కసారి స్టేడియం నుంచి బయటకు వస్తే.. మళ్లీ లోపలికి వెళ్లేందుకు వీలుండదు. మొత్తానికి ఈసీబీ, బీసీసీఐ అభిమానుల విషయంలో కఠిన నియమాలనే పెట్టాయి. తొలి దశలో ఆటగాళ్లకు కరోనా సోకడంతోనే ఇదంతా. ఇక ఐపీఎల్ 2021 తొలి దశలో 29 మ్యాచ్లే జరగ్గా.. ఈరోజు నుంచి అక్టోబరు 15 వరకూ మిగిలిన 31 మ్యాచ్లను జరగనున్నాయి.