పడిక్కల్ మెరుపు సెంచరీ:
179 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఓపెనర్లు దేవ్దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ ఆడుతో పాడుతూ ఛేదించారు. ఇద్దరూ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ముఖ్యంగా పడిక్కల్ బౌండరీల మోత మోగించాడు. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఓవర్కు పది పరుగులకు పైగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే పడిక్కల్ 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై కోహ్లీ కూడా 34 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. అనంతరం పడిక్కల్ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సులు, ఫోర్లు బాదుతూ 51 బంతుల్లో సెంచరీ చేశాడు. దాంతో 16.3 ఓవర్లలోనే బెంగళూరును విజయ తీరాలకు చేరింది.
43 పరుగులకే 4 వికెట్లు:
అంతకుముందు రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఆరంభంలోనే భారీ దెబ్బ తగిలింది. జోస్ బట్లర్ (8; 8 బంతుల్లో 2 ఫోర్లు), మనన్ వోహ్రా (7; 9 బంతుల్లో 1 ఫోర్) వెంటవెంటనే అవుట్ అయ్యారు. బట్లర్ను సిరాజ్ బోల్డ్ చేయగా.. వోహ్రాను కైల్ జేమిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలకపోవడంతో రాజస్థాన్ ఒత్తిడిలోకి కూరుకుపోయింది. దీనికి తోడు ఇన్ ఫామ్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ (0) డకౌట్ కావడంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. శాంసన్ను సుందర్.. మిల్లర్ను సిరాజ్ బుట్టలో వేసుకున్నారు.
మెరిసిన దూబే, తేవాతియా:
స్వల్ప స్కోరుకే టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అన్న సందేహం కలిగింది. అయితే శివమ్ దూబే (46; 32 బంతుల్లో 5×4, 2×6) స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్ (25; 16 బంతుల్లో 4×4) అండతో బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. పరాగ్ ఔట్ అయినా.. రాహుల్ తేవాతియాతో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. చివరలో తెవాటియా (40; 23 బంతుల్లో 4×4, 2×6) బౌండరీలు బాదడంతో రాజస్థాన్ ఊహించని స్కోరు సాధించింది. ఆరంభంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించిన బెంగళూరు బౌలర్లు మధ్య ఓవర్లలో తేలిపోయారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
కోహ్లీ6K:
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి బెంగళూరుకే ఆడుతున్న కోహ్లీ.. 6 వేల పరుగులు పూర్తిచేశాడు. 196 మ్యాచుల్లో కోహ్లీ ఏ ఫీట్ అందుకున్నాడు. అన్క్యాప్డ్ ఆటగాళ్లలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాదించిన ఆటగాడిగా దేవ్దత్ పడిక్కల్ ఘనత సాధించాడు. పాల్ వాల్తాటి (120 నాటౌట్-2011), మనీష్ పాండే (114 నాటౌట్-2009) గతంలో ఈ రికార్డు నెలకొల్పారు. బెంగళూరుకు ఇదే అత్యధిక(181) ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇప్పటివరకు ఈ సీజన్లో తొలిసారిగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.