పంజాబ్ కింగ్స్గా..
గత కొన్ని సీజన్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్లు మార్చినా ఫలితం దక్కలేదు. ఆరంభంలో అదరగొట్టడం చివర్లో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటైపోయింది. పైగా గెలిచే మ్యాచ్లో ఓడిపోవడం.. అదృష్టం ఏ మాత్రం కలిసి రాకపోవడం కూడా పంజాబ్ను వెంటాడింది. గత సీజన్లోనైతే ఆ జట్టు డబుల్ సూపర్ ఓవర్లు ఆడటం.. ఇంచు తేడాలో.. పరుగు వ్యవధిలో ఓటమి చవి చూడటం ఆ జట్టు ప్రతీ అభిమానిని బాధించాయి. ఈ క్రమంలో తీవ్ర చికాకుకు గురైన ఫ్రాంచైజీ యాజమాన్యం పేరు మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ బాటలో..
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పేరు మార్చుకొని ఫలితాన్ని రాబట్టడంతో తాము కూడా వారి బాటలోనే నడవాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. ఢిల్లీ డేర్ డేవిల్స్గా ఉన్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్గా మారి అద్భుత ప్రదర్శన కనబర్చింది. రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరింది. గత సీజన్లో రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. పంజాబ్ కింగ్స్గా పేరు మార్చుకోవాలనుకుంటుందని క్రిక్బజ్ పేర్కొంది. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ అనుమతి కోరిందని, బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ముంబైలో ఓ భారీ ప్రోగ్రామ్లో పేరు రివీల్ చేయాలని భావిస్తోందని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయని తెలిపింది.
వేలానికి ముందు పరీక్షలు..
ఇక చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరిగే వేలానికి హాజరయ్యేవారు స్వల్ప క్వారంటైన్లో ఉండాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశించింది. వేలానికి ఫ్రాంచైజీల తరఫున హాజరయ్యే వారికి ఒకరోజు ముందే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, వాటి ఫలితాలు 3-4 గంటల్లో వస్తాయని, అప్పటి వరకు అందరూ క్వారంటైన్ పాటించాలని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. 'వేలానికి ముందు రోజు ఫ్రాంచైజీ అధికారులందరికీ కరోనా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను బీసీసీఐ అక్రిడిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. వాటి ఫలితాలు వచ్చే వరకు అందరూ ఎవరికీ వారే వారికి కేటాయించిన గదుల్లో క్వారంటైన్ పాటించాలి. సాంపుల్స్ తీసుకున్న 3-4 గంటల్లోనే ఫలితాలు వస్తాయి'అని బీసీసీఐ అడ్వైజరీలో పేర్కొంది.
292 మందితో షార్ట్ లిస్ట్
ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనేందుకు 1,114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా... ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 11 స్థానాలు ఖాళీ ఉండగా.. అత్యల్పంగా సన్రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్ నుంచి హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, విదేశాల నుంచి.. స్మిత్, మ్యాక్స్వెల్ ఉన్నారు. ఇక ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్ను ఎవరు కొనుగోలు చేస్తారనేదే ఆసక్తిగా మారింది. అతను కనీస ధర రూ.20 లక్షలతో వేలంలో అందుబాటులో ఉన్నాడు.