న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన ఢిల్లీ కేపిటల్స్.. రెండో మ్యాచ్లో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్ను ఓడిపోయింది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊది అవతల పారేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన రెండో మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ విభాగంలో అద్భుతంగా రాణించింది. రాజస్థాన్ రాయల్స్ను దాదాపు ఓడించినంత పని చేసింది. లక్ష్యంగా నిర్దేశించింది 147 పరుగులే అయినప్పటికీ..మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం ప్రత్యర్థికి ఏ మాత్రం ఇవ్వలేదు. చివరి ఓవర్ వరకూ మ్యాచ్ను లాక్కెళ్లగలిగింది.
ధోనీ మెడపై వేలాడుతోన్న కత్తి: పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో తేలనున్న భవితవ్యం.. కొత్త భయం
అలాంటి ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ మళ్లీ గాయాల బారిన పడటం వల్ల జట్టు కూర్పులో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ.. అవన్నీ తొలగిపోనున్నాయి. దీనికి కారణం- బౌలింగ్ తురుఫుముక్క అన్రిచ్ నార్ట్జె జట్టుతో కలవనుండటమే. బయో బబుల్ సెక్యూర్ను బ్రేక్ చేయడం వల్ల జట్టుకు దూరమైన అతను మళ్లీ తిరిగి రానున్నాడు. జట్టుతో కలవనున్నాడు. తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉండబోతున్నాడు. ఢిల్లీ కేపిటల్స్ తన తదుపరి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడబోతోంది. ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:30కు ఆరంభమౌతుంది.
బయో బబుల్ నిబంధనల ప్రకారం.. దాన్ని బ్రేక్ చేసిన క్రికెటర్ మళ్లీ జట్టుతో కలవాలంటే మూడు కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్లను మేనేజ్మెంట్కు అందజేయాల్సి ఉంటుంది. అలాగే- 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. అన్రిచ్ నార్ట్జె తనకు సంబంధించిన కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్లను జట్టు యాజమాన్యానికి అందజేశాడు. నార్ట్జె పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని మేనేజ్మెంట్ వెల్లడించింది. క్వారంటైన్ పీరియడ్ను ముగించుకున్న నార్ట్జె జట్టుతో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేసింది.
దక్షిణాఫ్రికాకు చెందిన నార్ట్జె ఫాస్ట్ బౌలర్. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతిని సంధించగల సత్తా అతనికి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా గత ఏడాది సాగిన ఐపీఎల్ సీజన్తో అతను ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టులో చేరాడు. ఇప్పటిదాకా 16 మ్యాచ్లను ఆడిన నార్ట్జె 22 వికెట్లను పడగొట్టాడు. 33 పరుగులకు మూడు వికెట్లు అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అతని ఎకానమీ 8.39. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుందతనికి. ఇషాంత్ శర్మ మడమల్లో గాయంతో బాధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నార్ట్జె జట్టుతో కలవడం రిషబ్ పంత్ టీమ్కు పెద్ద ఊరటే.. బౌలింగ్ వింగ్ మరింత బలపడినట్టే.