For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ఈ మెగా టోర్నీకి స్కోరర్‌గా వ్యవహరించింది మన జనగాం బిడ్డే..! ఎవరాయన?

IPL 2020: This Telangana man had worked as scorer for the Cash rich league

అబుధాబి: ఇంకో రెండు మ్యాచ్‌లే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్.. ముగింపు దశకు వచ్చేసింది. లీగ్ దశను ముగించుకున్న ఈ మెగా టోర్నమెంట్.. ప్రస్తుతం ప్లేఆఫ్ స్టేజ్‌లో కొనసాగుతోంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ సహా ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆదివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

ఆ మ్యాచ్‌తో ప్లేఆఫ్ దశ కూడా ముగుస్తుంది. మంగళవారం ఫైనల్. రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌ విజేత.. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతుంది. నెలన్నర రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఎప్పట్లాగే ఉర్రూతలూగించిన ఐపీఎల్-2020 సీజన్‌లో కొన్ని అద్భుతాలే జరిగాయనుకోవచ్చు. టైటిల్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. కనీసం ప్లేఆఫ్ దశను కూడా అందుకోలేకపోయింది. ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగిన మొదటి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆ జట్టు బ్లాస్టింగ్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై పలికాడు. ఇదే అతని చివరి ఐపీఎల్ టోర్నమెంట్.

టీమిండియాను విజయాల బాట పట్టించిన సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా పేరున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలను చవి చూసింది ఈ టోర్నీలోనే. వరుసగా నాలుగు ఓటములను తన ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్‌లో సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య అయిదుకు పెరుగుతుంది. మొత్తం అయిదు మ్యాచుల్లో ఏ ఒక్కదాన్నీ గెలవలేకపోయింది. విరాట్ కోహ్లీ వ్యూహాలు, ఎత్తుగడలు ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపట్లేదనడానికి ఈ పరాజయాలను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు.

ఇదిలావుంటే ఐపీఎల్-2020 సీజన్‌పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ. ఉద్యోగరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన అన్ని మ్యాచ్‌లకూ ఆయనే ప్రధాన స్కోరర్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోయేది ఈ స్టేడియంలోనే. 39 సంవత్సరాల ప్రశాంత్ కుమార్.. దివ్యాంగుడు. ఐపీఎల్ టోర్నీలో మ్యానువల్‌గా స్కోరుబోర్డును నోట్ చేసేది ఆయనే.

స్కూల్ స్థాయిలో క్రికెట్‌ను ఆడేవాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. శ్రీ అరబిందో హైస్కూల్‌ తరఫున క్రికెట్ ఆడారు. విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. అనంతరం ఆయనకు దుబాయ్‌లోని యోగి గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉద్యోగం లభించింది. అదే సంస్థలో పనిచేసే శివ పగరాణితో పరిచయం ఏర్పడిన తరువాత.. క్రికెట్ వైపు అడుగులు వేశారు. ఉద్యోగం చేస్తూనే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్కోరర్‌గా చేరారు. శివ..దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు కావడంతో ప్రశాంత్ కుమార్‌ను ప్రోత్సహించారు.

2009లో దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో ఆయన స్కోరర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఆ స్టేడియంలో జరిగే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లన్నింటికీ ఆయనే స్కోరర్. క్రికెట్‌పై తనకు ఉన్న ఆసక్తి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ప్రశాంత్ కుమార్ చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ ఇంగ్లీష్ డెయిలీకి ఆయన టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. క్రికెట్ పట్ల తనకు ఉన్న ఆసక్తిని గమనించిన సంస్థ యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. యోగి గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో అసిస్టెంట్ డివిజినల్ మేనేజర్‌గా నియమించిందని పేర్కొన్నారు.

Story first published: Saturday, November 7, 2020, 21:36 [IST]
Other articles published on Nov 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+