ఆర్చర్కు ఇంకో ఓవర్ ఇవ్వాల్సింది:
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'మేం ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించాం. ఆదిలోనే జోఫ్రా ఆర్చర్ రెండు పెద్ద వికెట్లను తీశాడు. కానీ దాన్ని కొనసాగించలేకపోయాం. విజయ్ శంకర్ తెలివిగా ఆడితే.. మనీష్ పాండే ఆటను మా నుంచి దూరం చేశాడు. వాళ్లిద్దరూ చాలా బాగా ఆడారు. మనీష్-శంకర్ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి మా జట్టుతో సంప్రదింపులు జరిపాను. మళ్లీ ఆర్చర్ను బౌలింగ్కు దింపాలని అనుకున్నా.. కానీ అలా చేయలేదు. కొందరు ఇపుడే వద్దని సూచించారు. అందుకే ఆర్చర్కు ఇంకో ఓవర్ ఇవ్వాల్సింది. ఇక్కడే తప్పు చేశాం' అని అన్నాడు.
దేన్నీ వేలెత్తి చూపలేను:
'మ్యాచ్ జరిగేకొద్దీ వికెట్ పూర్తిగా మారిపోయింది. తొలి ఇన్నింగ్స్లో నెమ్మదిగా ఉంది. దాంతో మంచి ఆరంభానికి కుదరలేదు. మేం మరిన్ని పరుగులు చేయాల్సింది. ఏదేమైనా ఈ ఓటమికి కారణంపై దేన్నీ వేలెత్తి చూపలేను. ఇక్కడ చాలా మంది అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు మంచి జట్లు ఉన్నాయి. మేం వరుసగా విజయాలు సాధించలేకపోయాం. ఇకపై అన్నీ గెలవాల్సి ఉంది. ఇక ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పాయింట్ల పట్టిక ఎలా ఉండబోతుందో నాకు తెలీదు. ఇక గెలవడం ఒక్కటే మా పని' అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.
140 పరుగుల భాగస్వామ్యం:
దుబాయ్ వేదికగా గురువారం రాత్రి టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (36; 26 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనకు దిగిన సన్రైజర్స్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మనీష్ పాండే (83*; 47 బంతుల్లో 4x4, 8x6), విజయ్ శంకర్ (52*; 51బంతుల్లో 6x4) విజయాన్ని అందించారు. పాండే, శంకర్ కలిసి 140 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పారు. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్టే. ఒకవేళ మిగతా 3 మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు ఇతర జట్ల కన్నా మెరుగైన రన్రేట్ ఉంటేనే వీలుంటుంది.