వంద పరుగులకే ఆపసోపాలు..
ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో భాగంగా గురువారం రాత్రి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో దీనికి అద్దం పట్టింది. 20 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కుర్రాళ్లు విసిరిన స్పిన్ గాలానికి చేపల చిక్కుకుపోయారు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు. విలవిల్లాడిపోయారు. వంద పరుగులను చేయడానికే ఆపసోపాలు పడ్డారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. చేసిన వ్యక్తిగత స్కోరును కూడా అందుకోలేకపోయిందంటే..రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్లు ఏ రేంజ్లో వైఫల్యం చెందారనేది అర్థం చేసుకోవచ్చు.
చెలరేగిన రవి బిష్ణోయ్..మురుగన్ అశ్విన్
రవి బిష్ణోయ్..మురుగన్ అశ్విన్.. ప్రస్తుతం ఈ ఇద్దరు స్పిన్ బౌలర్ల పేర్లు క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ను వారిద్దరు కలిసి మట్టి కరిపించేశారు. ఇద్దరూ కలిపి ఆరు వికెట్లను పడగొట్టారు. రాయల్స్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. మరో స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తనవంతు సహకారం అందించాడు. ముగ్గురు స్పిన్ బౌలర్లు ఏకంగా ఏడుమంది బ్యాట్స్మెన్లను పెవిలియన్ దారి పట్టించారు. పేస్ బౌలర్లు షెల్డన్ కాట్రెల్ రెండు, మహ్మద్ షమీ ఒక వికెట్తో రాయల్ ఛాలెంజర్స్ ఓటమిని పరిపూర్ణం చేశారు.
ఇసుక తుఫాన్.. రవి బిష్ణోయ్..
రవి బిష్ణోయ్. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన 20 ఏళ్ల కుర్రాడు. టీమిండియా అండర్-19 టీమ్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నాడు. 2017లో రాజస్థాన్ తరఫున లీగ్ మ్యాచ్ల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇసుక తుఫాన్లా క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొచ్చాడు. రాజస్థాన్ తరఫున లీగ్ మ్యాచ్లను ఆడాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ఆడిన రెండో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్తో మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లను పడగొట్టాడు. తన గూగ్లీ మాయతో అరోన్ ఫించ్, వాషింగ్టన్ సుందర్, ఉమేష్ యాదవ్ను బోల్తా కొట్టించాడు.
తమిళనాడుకు చెందిన మురుగన్
తమిళనాడుకు చెందిన మురుగన్ అశ్విన్.. లెగ్ బ్రేక్ బౌలర్. ఇదివరకు ఐపీఎల్లో పలు మ్యాచ్లను ఆడిన అనుభవం ఉంది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఈ సారి కింగ్స్ ఎలెవెన్తో కలిశాడు. రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లను పడగొట్టాడు. ఫిలిప్, ఏబీ డివిలియర్స్, నవదీప్ షైనీని పెవిలియన్ దారి పట్టించాడు. రవి బిష్ణోయ్తో కలిసి చెలరేగిపోయాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు కలిసి ఆరు వికెట్లను పడగొట్టారు. శివం దుబే వికెట్ను మరో స్పిన్నర్ మ్యాక్స్వెల్ తన ఖాతాలో వేసుకున్నాడు.