టెస్టులతోనే అసలు మజా..
ఈ ధనాధన్ ఫటాఫట్ క్రికెట్ వల్ల ఆటగాళ్ల అసలు టాలెంట్ మరుగున పడిపోతోందని, దూకుడు తప్ప డిఫెన్స్ క్రికెట్ అనేదే లేకుండా పోతోందనే ఆందోళన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అసలు సిసలు క్రికెట్ మజాను రుచి చూడాలంటే టెస్టుల్లోనే సాధ్యపడుతుందని, ఓ బ్యాట్స్మెన్ లేదా బౌలర్ సామర్థ్యానికి సవాల్ విసిరేది ఒక్క టెస్టు మ్యాచ్లేననే అభిప్రాయాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఐపీఎల్ రికార్డులను ఆధారంగా చేసుకుని ఓ క్రికెటర్ నైపుణ్యాన్ని, బ్యాటింగ్ శైలిని, అతను అనుసరించే టెక్నికాలిటీని, అతనిలోని క్వాలిటీస్ ప్రాతిపదికగా తీసుకోవడానికి ఐపీఎల్ ఏ మాత్రం సరికాదనే వాదనలూ లేకపోలేదు.
క్రికెట్ మనుగడకే ప్రమాదం
ఐపీఎల్ లేదా టీ20 ఫార్మట్ క్రికెట్ వల్ల అసలు వన్డే, టెస్టుమ్యాచ్ల మనుగడ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయం మరోసారి వ్యక్తమౌతోంది. వీలైనంత మేర ఈ టీ20 ఫార్మట్ క్రికెట్ సిరీస్లను తగ్గించడమే మేలని అంటున్నారు. అలా కుదరకపోతే.. ఐపీఎల్ ఫార్మట్లో కొన్ని మార్పులు చేర్పులు అయినా చేయాలనే డిమాండ్ ఇదివరకే ఓ వ్యక్తమైంది. మళ్లీ అదే తరహా డిామాండ్, దానితో పాటు కొన్ని సూచనలు తెరమీదికి వచ్చాయి.
ఐపీఎల్ ఫార్మట్లో మార్పులు అవసరం..
ఐపీఎల్ ఫార్మట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్, టాప్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ చెప్పారు. క్రికెట్లో బంతికి, బ్యాట్కు మధ్య పోటీ ఉండాల్సింది సిక్సుల కోసం కాదని అన్నారు. మూడు సూచనలను ఆయన ప్రతిపాదాంచారు. ఈ మార్పులను ఐపీఎల్ ఫార్మట్లో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ గురించి షేన్ వార్న్ పరోక్షంగా ప్రస్తావించారు. చివరి ఆరు ఓవర్లలో 104 పరుగులను రాబట్టుకోవడంపై తన స్పందనను వ్యక్తం చేశారాయన. రాజస్థాన్ రాయల్స్ మెంటార్గా ఉన్న ఆయన ప్రస్తుతం తన టీమ్తో పాటు యూఏఈలో ఉన్నారు.
ఐపీఎల్లో మూడు మార్పులు..
ఐపీఎల్లో మూడు మార్పులను చేయాల్సిన అవసరం ఉందని షేన్ వార్న్ పేర్కొన్నారు. వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఒకటి- మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో బౌండరీ లైన్ను మరింత పెద్దవి చేయాల్సిన అవసరం ఉందని, విస్తీర్ణం తక్కువగా గల వేదికల్లో గ్రౌండ్పై గ్రాస్ కత్తించకుండా ఉండాలని చెప్పారు. రెండు- ప్రతి బౌలర్ తప్పనిసరిగా అయిదు ఓవర్లను వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పడున్నట్లుగా నాలుగుకు బదులుగా అయిదు ఓవర్ల కోటాను బౌలర్లకు కేటాయించాలని సూచించారు. మూడు- పిచ్ ఫ్లాట్గా ఉండకూదని చెప్పారు. ఒక టెస్ట్ మ్యాచ్లో నాలుగో రోజు పిచ్ ఎలా ఉంటుందో.. అలాంటి వాటిని ఐపీఎల్ కోసం తీర్చిదిద్దాల్సి ఉందని అన్నారు.