ముంబై: వచ్చే సీజన్ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండు నెలల పాటు జరగనుంది. ప్రస్తుతం 45 రోజులు సాగుతున్న ఐపీఎల్ టోర్నీని మరో 15 రోజులు పొడిగించాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే సీజన్లో రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ను కూడా రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. ఈ మేరకు వచ్చే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
ధోనీ మా గెస్ట్.. డ్రస్సింగ్ రూమ్లో ఉన్నాడు.. హలో చెప్పండి!!
ప్రస్తుతం 45 రోజులు సాగుతున్న ఐపీఎల్ టోర్నీని రెండు నెలలకు పొడిగించడానికి కారణం ఉంది. ఐపీఎల్లో మధ్యాహ్నం మ్యాచ్లను కుదించాలని బీసీసీఐ బోర్డు బావిస్తుండడమే అసలు కారణం. ఎండల తీవ్రత దృష్ట్యా ఇకపై ఒక్కో జట్టు సీజన్లో ఒకటే మధ్యాహ్నం మ్యాచ్ ఆడనుంది. దాంతో వారాంతాల్లో జరిగే రెండు మ్యాచ్ల సంఖ్య కూడా తగ్గనుంది. అంతకుముందు వారాంతాల్లో రెండు మ్యాచ్లను నిర్వహించేవారు.. కానీ వచ్చే సీజన్లో ఒకే మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
మరోవైపు ప్రతీ మ్యాచ్ను సాయంత్రం 7 గంటలకు మాత్రమే జరిపేలా బీసీసీఐ పరిశీలించే అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ను ప్రారంభించినప్పుడు ఎన్నో మ్యాచ్లు అర్ధరాత్రి వరకు జరిగాయి. దీంతో స్టేడియానికి వచ్చే అభిమానులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇక టీవీల్లో చూసే అభిమానులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇవన్ని పరిగణలోకి తీసుకుని మ్యాచ్ను ముందుగా ఆరంభించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. అయితే అన్ని మ్యాచులను రాత్రి ఏడు గంటలకు ప్రారంభించేందుకు జట్ల యాజమాన్యాలు పొప్పుకోవడం లేదు.
ఇప్పటివరకు జరిగిన 45 రోజుల షెడ్యూలే ఎక్కువ. అభిమానులు కొన్ని మ్యాచ్లను చూడడం లేదు. రసవత్తర పోటీ ఉంటే తప్ప అభిమానులు చూడట్లేదు. ఇక రెండు నెలలకు పొడిగిస్తే.. లీగ్ పూర్తిగా బోర్ కొట్టే అవకాశం కూడా ఉంది. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. వచ్చే ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం జరగనుంది. వచ్చే సీజన్ కోసం ప్రాంఛైజీలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, సహాయ సిబ్బందిని మారుస్తున్నారు.