దుబాయ్: మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (68), యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (33) రాణించడంతో ఢిల్లీ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్ మ్యాచ్ ద్వారా రోహిత్ ఐపీఎల్లో రెండు అరుదైన రికార్డులు నెలకొల్పగా.. మరొదాన్ని కోల్పోయాడు.
ఫైనల్లో రోహిత్ శర్మ (68) మరో రెండు పరుగులు చేసి ఉంటే.. ఒక రికార్డును తన ఖాతాలో వేసుకునేవాడు. టీ20 లీగ్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా డేవిడ్ వార్నర్ (69) 2016లో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ సీజన్లోనూ ఏ కెప్టెన్ కూడా ఫైనల్లో 69 పరుగులకు మించి చేయలేదు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఫైనల్ మ్యాచ్లో మరో రెండు పరుగులు చేసి ఉంటే.. వార్నర్ని అధిగమించేవాడు. కానీ వార్నర్ కన్నా ఒక పరుగు తక్కువకే ఔటై ఆ అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
ఐపీఎల్ ఫైనల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ రెండు అర్ధ సెంచరీలు సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. 2015 సీజన్లో కోల్కతా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తుది పోరులో రోహిత్ 26 బంతుల్లోనే 50 రన్స్ పూర్తి చేశాడు. ఇక ఐపీఎల్ 2020 ఫైనల్లో మరొకటి బాదాడు. దీంతో కెప్టెన్గా రెండు అర్ధ సెంచరీలు సాధించి ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
2016 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 69 పరుగులు చేశాడు. మంగళవారం ముంబైతో మ్యాచ్లో ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ (65 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ 2013లో ముంబైపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ (63) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ పోరులో అత్యధిక స్కోరు చేసిన రికార్డు వార్నర్ (69) పేరిట ఉంది.
2016 తర్వాత ఫైనల్ మ్యాచ్లో ఇద్దరు కెప్టెన్లు (శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ) అర్ధ శతకాలు సాధించడం ఇదే తొలిసారి. మొత్తంగా చూసినా ఇది రెండోసారి మాత్రమే. 2016లో బెంగళూరుతో తలపడిన సందర్భంగా హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (69) పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ (54) రన్స్ చేశాడు.
అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కోచ్ ఎవరో తెలుసా?