కోహ్లీ ఫామ్ అందుకుంటేనే
హైదరాబాద్పై అద్భుతంగా రాణించిన బెంగళూరు.. పంజాబ్తో మ్యాచ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. తనకు అలవాటైన రీతిలో పరుగులివ్వడంలో బౌలర్లు.. పెవిలియన్కు చేరడంలో బ్యాట్స్మెన్ పోటీపడ్డారు. దీంతో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లీ ఇంకా తన బ్యాటుకు పనిచెప్పలేదు. తొలి మ్యాచ్లో మెరిసిన దేవదూత్ పడిక్కల్ రెండో మ్యాచ్లో నిరాశపరిచాడు. ఇక హిట్టర్ ఆరోన్ ఫించ్ ప్రభావమే చూపలేదు. ఇక జట్టులో కీలక బ్యాట్స్మన్ అయిన ఏబీ డివిలియర్స్ రెండో మ్యాచ్లో త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్లు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాల్సి ఉంది. అందరూ ఫామ్ అందుకుంటేనే.. భారీ స్కోర్ చొయొచ్చు.
బౌలర్లతోనే ప్రధాన సమస్య
బెంగళూరుకు లీగ్ ఆరంభం నుంచి ఉన్న ప్రధాన సమస్య బౌలర్లతోనే. బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేసినా.. బౌలర్లు అంతకుమించి పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టు విజయాలను అందుకోలేకపోతోంది. బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాల్సిన స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ సైతం అంచనాలు అందుకోవడం లేదు. ఇక ఉమేశ్ యాదవ్ సంగతి చెప్పనక్కర్లేదు. భారీగా రన్స్ ఇస్తున్నాడు. క్రిస్ మోరిస్ లేదా మొయిన్ అలీ ఎవరో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. స్టెయిన్ స్థానంలో శ్రీలంక బౌలర్ ఇసురు ఉదానను తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఉమేశ్ స్థానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను తీసుకోవచ్చు. స్పిన్ విభాగంలో యుజువేంద్ర చహల్ మాత్రం రాణిస్తున్నాడు. ఇదెక్కటే బెంగళూరుకు సానుకూలాంశం.
పటిష్టంగా ముంబై
చెన్నై చేతిలో ఓడిపోయినా.. కోల్కతాను ఓడించిన ముంబై మంచి ఊపులో ఉంది. ముంబై జట్టులో ఎవరో ఒకరు బ్యాటింగ్ చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి బాగా ఆడుతున్నారు. ఇది ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే క్వింటన్ డికాక్ పూర్తి స్థాయిలో తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. హీటర్లు హార్దిక్, కృనాల్ ఉండనే ఉన్నారు. బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్ మంచి ఫామ్లో ఉన్నారు. డెత్ ఓవర్ల స్పెషలిస్టు జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అయితే స్పిన్నర్లు రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
25 సార్లు తలపడగా
ముంబై, బెంగళూరు జట్లు 25 సార్లు ఐపీఎల్ టోర్నీలో తలపడ్డాయి. అందులో 16 మ్యాచుల్లో ముంబై.. 9 మ్యాచుల్లో బెంగళూరు గెలుపొందాయి. ఈసారి కూడా ముంబై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. అయితే దుబాయ్ మైదానంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ రోహిత్ సేన ఓడిపోయింది. ఇది బెంగళూరుకు కలిసొచ్చే అంశం. ఈ మైదానంలో బెంగళూరు నాలుగు మ్యాచ్లాడి.. రెండింట్లో ఓడి మరో రెండింట్లో గెలిచింది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జట్లు (అంచనా)
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృణాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదూత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబి డివిలియర్స్, శివం దూబే, మొయిన్ అలీ, ఇసురు ఉదాన/డేల్ స్టెయిన్, వాషింగ్టన్ సుందర్, నవ్దీప్ సైనీ, మహమ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్.
RR vs KXIP: సిక్సులు బాదగలనని తెలుసు.. కానీ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమే: తెవాటియా