ఈ సీజన్లో అత్యధిక పరుగులు
ఈ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు (525) సాధించిన బ్యాట్స్మెన్గా రాహుల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 9 ఇన్నింగ్స్లలో రాహుల్ 525 రన్స్ చేశాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్మన్గా కూడా రాహుల్ నిలిచాడు. లీగ్ ఆరంభం నుంచి పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న ముంబైపై ఇప్పటిదాకా రాహుల్ 580 పరుగులు చేశాడు.
మూడు సీజన్లలోనూ 500 పరుగులు
ఈ మ్యాచ్లో 77 పరుగులు చేసే క్రమంలో కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో వరుసగా మూడు సీజన్లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్మన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2019లో 593, 2018లో 659 రన్స్ చేశాడు రాహుల్. గతంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు బాదాడు.ఇక భారత క్రికెటర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మన్ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు.
వార్నర్ కూడా
సన్రైజర్సర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లీగ్లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి విదేశీ ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వార్నర్ (47) పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ 5037 పరుగుల రికార్డును అందుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన బ్యాట్స్మన్గానూ నిలిచాడు. విరాట్ కోహ్లీ ఇదివరకు 157 ఇన్నింగ్స్ల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా.. వార్నర్ 135 ఇన్నింగ్స్ల్లో దాన్ని అధిగమించాడు.