
కొలొంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న లంకన్ ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) ప్రారంభ సీజన్ వాయిదా పడింది. లంక ఆరోగ్య అధికారులు క్వారంటైన్ సమయంను ఆమోదించకపోవడంతో ఎల్పీఎల్ వాయిదా పడింది. ఈ టోర్నీ నవంబర్ చివరి వారంలో జరగనుందని సమాచారం. దాదాపు 5 నెలల తర్వాత దేశంలో క్రికెట్ పునఃప్రారంభం కావాలని ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిజంగా ఇది చేదు వార్తే.
ఎల్పీఎల్ వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లు ఇక్కడికి రానవసరం లేకుండా పోయింది. లియామ్ ప్లంకెట్, డ్వేన్ స్మిత్, టిమ్ సౌతీ వంటి స్టార్ ప్లేయర్లు లంక ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఎల్పీఎల్ వాయిదా పడడంతో లంక ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్), ఇస్రు ఉడానా (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)లు లీగ్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నారు. వీరితో పాటు మరికొందరు లంక ఆటగాళ్లు కూడా ఐపీఎల్ 2020లో ఆడనున్నారు.
ఎల్పీఎల్ ఆగస్టు 28న ప్రారంభమై సెప్టెంబర్ 20తో ముగుస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే శ్రీలంక బోర్డు అధికారిక షెడ్యూల్ను మాత్రం ప్రకటించలేదు. లీగ్ మధ్యలో వేరే టోర్నీలు ఆడేందుకు తమ ప్లేయర్లను అనుమతించమని లంక బోర్డు స్పష్టం చేసింది. దీంతో మలింగ, ఉడానాలు ఐపీఎల్ 13వ ఎడిషన్లోని మొదటి వారం మ్యాచ్లకు దూరం కానున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎల్పీఎల్ వాయిదా పడడంతో ఐపీఎల్ 2020 ఆడేందుకు లంక ఆటగాళ్లకు లైన్ క్లియర్ అయింది.
మరోవైపు దక్షిణాఫ్రికా ప్లేయర్లు కూడా ఐపీఎల్కు ఇన్టైమ్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ అమలులో ఉండడమే ఇందుకు కారణం. దీంతో ఆర్సీబీ కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్ దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ జట్టు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక సెప్టెంబర్ 16 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ జరగనుండడంతో వారు ఫస్ట్ వీక్ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా, ఇంగ్లండ్, ఆసీస్ మధ్య సెప్టెంబర్ 16న చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్లో ఆడే ఇరు జట్లు ఆటగాళ్లు అదే రోజున దుబాయ్ బయలుదేరే అవకాశముంది. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనల కారణంగా ఫస్ట్ వీక్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన నిబంధనల కారణంగా ఫస్ట్ వీక్ మ్యాచ్లకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ లీగ్ వీదేశీ ఆటగాళ్ల జాబితాలో ఈ రెండు దేశాల ఆటగాళ్లదే మెజార్టీ వాటా. ఆస్ట్రేలియా (17), ఇంగ్లండ్ (11) నుంచి మొత్తం 28 మంది ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకున్నారు.